- కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
న్యూఢిల్లీ: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తప్పిదాలకు విద్యార్థులు మూల్యం చెల్లించాల్సి వస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. యూజీసీ-నెట్ జూన్ 2026లో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసి సెప్టెంబర్లో మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించడంపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్టీఏను ప్రశ్నించారు.
‘‘మోదీజీ.. మీ ఎన్టీఏ ఏంచేసిందో చూడండి. ఏండ్ల తరబడి పరీక్షకు సిద్ధమైన వేలాది మంది స్టూడెంట్లు ఫారాలు నింపి, ఫీజులు చెల్లించి, దూర ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు వెళ్లారు. ఇప్పుడు సెప్టెంబర్లో మళ్లీ ఇవన్నీ చేయాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్టీఏ.. శిక్ష మాత్రం విద్యార్థులకు’’ అని రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేశారు.
పరీక్షకు ముందే ప్రశ్నపత్రాలు లీకయ్యాయా? అనే ప్రశ్నలకు ఎన్టీఏ సమాధానం చెప్పట్లేదని ఆరోపించారు. పరీక్షా వ్యవస్థలో వరుసగా తలెత్తుతున్న సమస్యల వల్ల విద్యార్థులు సమయం, డబ్బు, అవకాశాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో బాధ్యత ముగియదని, ఎన్టీఏ నాయకత్వంపైనా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
