
న్యూఢిల్లీ: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కు(ఎన్టీపీసీ) ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్లో నికర లాభం 16.6 శాతం పెరిగి రూ.3,885 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.3,331 కోట్లు వచ్చాయి. తాజా క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.40,875 కోట్లుగా ఉంది. ఇది క్రితం సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.41,015 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ క్వార్టర్లో కంపెనీ మొత్తం ఆదాయం గత ఏడాది ఇదే కాలంలో రూ.44,681.50 కోట్లతో పోలిస్తే రూ.45,384.64 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.10,537.4 కోట్లుగా ఉంది.
ఇది క్రితం సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.9,134.7 కోట్లు ఉంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఆపరేటింగ్ మార్జిన్ 270 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) పెరిగి 25.8 శాతంగా ఉంది. ఇది గత సంవత్సరం రెండో క్వార్టర్లో 23.1 శాతంగా ఉంది. శనివారం జరిగిన ఎన్టీపీసీ బోర్డు సమావేశంలో 2023-–24 ఆర్థిక సంవత్సరానికి మొదటి మధ్యంతర డివిడెండ్ను 22.5 శాతం (ఒక్కో షేరుకు రూ.2.25) చొప్పున చెల్లించాలని నిర్ణయించింది.
డివిడెండ్ చెల్లింపు వచ్చే నెల 23న ఉంటుంది. ఎన్టీపీసీ సెప్టెంబర్ క్వార్టర్లో క్యాప్టివ్ మైన్స్-కమర్షియల్ నుంచి 5.59 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) బొగ్గును ఉత్పత్తిని చేసింది. గత సంవత్సరం రెండో క్వార్టర్లో ఇది 4.32 ఎంఎంటీలు. కరెంటు సగటు టారిఫ్ యూనిట్కు రూ.4.77 నుంచి రూ.4.61లకు తగ్గింది. స్థూల కరెంటు ఉత్పత్తి రెండవ క్వార్టర్లో 85.48 బీయూల నుంచి నుంచి 90.30 బిలియన్ యూనిట్లకు (బీయూలు) పెరిగింది.
ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ లేదా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం ఏడాది క్రితం 74.08 శాతం నుంచి క్వార్టర్లో 75.83 శాతానికి మెరుగుపడింది. దేశీయ బొగ్గు సరఫరా కూడా సెప్టెంబర్ క్వార్టర్లో 48.72 ఎంఎంటీల నుంచి 54.16 ఎంఎంటీకి మెరుగుపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఎన్టీపీసీ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కెపాసిటీ 73,824 మెగావాట్లుగా ఉంది.