- 9 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు
- మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.247 కోట్లు
- అందులో డబ్బాలకే రూ.44 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గర్భిణులకు న్యూట్రిషనల్ కిట్లను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, వికారాబాద్, జోగులాంబ గద్వాల్, నాగర్కర్నూల్, ములుగు జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసింది. ఈ 9 జిల్లాల్లో 1,24,776 మంది గర్భిణులు ఉన్నారు. ఒక్కో గర్భిణికి రెండు కిట్లు ఇవ్వనున్నారు. తొలి కిట్ను గర్భం దాల్చిన మూడో నెలకు, రెండో కిట్ను ఐదో నెలలో ఇవ్వనున్నారు. ఒక్కో కిట్లో కిలో న్యూట్రిషనల్ పౌడర్, కిలో ఎండు ఖర్జూర, అరకిలో నెయ్యి, మూడు బాటిళ్ల ఐరన్ టానిక్, ఒక అల్బెండజోల్ ట్యాబ్లెట్ ఉంటాయి. ఈ వస్తువులను దాపెట్టుకునేందుకు ఒక బాక్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
తమిళనాడు స్ఫూర్తితో...
తమిళనాడు రాష్ట్రంలో ‘అమ్మ కిట్స్’ పేరుతో ఎప్పట్నుంచో న్యూట్రిషనల్ కిట్లను అందజేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉండడంతో అదే తరహా స్కీమ్ను ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించారు. అక్కడ అమ్మ కిట్స్ అని పేరు పెడితే, ఇక్కడ కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్స్ అని పేరు పెట్టారు. కిట్లో ఇచ్చే ఐదు వస్తువులకు రూ.1,580 ఖర్చవుతుందని ఆఫీసర్లు లెక్కగట్టారు. ఈ ఐదు వస్తువులను దాచిపెట్టుకునేందుకు ఇచ్చే బాస్కెట్ను రూ.359 పెట్టి కొనుగోలు చేయబోతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6.16 లక్షల మంది గర్భిణులకు రెండేసి కిట్ల చొప్పున ఇవ్వడానికి రూ.247 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఒక్కో బాస్కెట్కు రూ.359 చొప్పున 12.32 లక్షల బాస్కెట్ల కొనుగోలు కోసమే రూ.44.29 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అంటే మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో సుమారు 18 శాతం బాక్సుల కోసమే ఖర్చు చేస్తుండడం గమనార్హం.