- వరదలొచ్చినా చర్యలు తీసుకోరా
హైదరాబాద్, వెలుగు : వర్షాలు, వరదలతో రాష్ట్రమంతా అస్తవ్యస్థంగా మారిందని, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. వరదలొచ్చినా చర్యలు తీసుకోరా అంటూ సర్కారుపై ఆయన ఫైర్ అయ్యారు. శుక్రవారం బీజేపీ స్టేట్ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ను డల్లాస్, సింగపూర్ చేస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పారని, తొమ్మిదేండ్లయినా సిటీని డల్లాస్, సింగపూర్గా ఎందుకు మార్చలేదని ఆయన నిలదీశారు.
వానాకాలంలో హైదరాబాద్ అభివృధ్ది బయటపడుతున్నదన్నారు. హైదరాబాద్ లోని మూడు వందల చెరువుల్లో పూడిక తీస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగేదని, మిషన్ కాకతీయ స్కీం హైదరాబాద్లో ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. సిటీ చెరువుల కబ్జా వెనుక బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని, చెరువుల కబ్జా వల్లే నీళ్లు కాలనీల్లోకి వచ్చాయన్నారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నేతలు కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్లెక్సీలు కడుతూ, కేక్ కట్ చేస్తూ హంగామా చేశారని మండిపడ్డారు.