న్యూజిలాండ్ సిరీస్ లో.. పంత్‌‌కు చోటు దక్కేనా.?

న్యూజిలాండ్ సిరీస్ లో..  పంత్‌‌కు చోటు దక్కేనా.?

న్యూఢిల్లీ:  న్యూజిలాండ్‌‌తో వన్డే సిరీస్‌‌కు టైమ్‌‌ దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. విజయ్‌‌ హజారే ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌‌ల్లో కేవలం ఒక్క హాఫ్‌‌ సెంచరీ మాత్రమే చేసిన రిషబ్‌‌ పంత్‌‌కు ఈ సిరీస్‌‌లో చాన్స్‌‌ ఇస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. పంత్‌‌ దూకుడైన బ్యాటింగ్‌‌ను సెలెక్షన్‌‌ కమిటీలోని ఓ సభ్యుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అతను సాంప్రదాయమైన బ్యాటింగ్‌‌ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే పంత్‌‌కు సరైన అవకాశాలు ఇవ్వకుండా వన్డేల నుంచి తొలగించడం కరెక్ట్‌‌ కాదని మరికొంత మంది వాదన. గతేడాది చాంపియన్స్‌‌ ట్రోఫీ, సౌతాఫ్రికాతో సిరీస్‌‌ కోసం టీమ్‌‌లో ఉన్నప్పటికీ పంత్‌‌కు ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో ఆడే చాన్స్‌‌ దక్కలేదు.

 రుతురాజ్‌‌ నాలుగో ప్లేస్‌‌లో ఆడటం వల్ల పంత్‌‌కు చాన్స్‌‌ రాలేదు. ఇక 2018లో అరంగేట్రం చేసినప్పట్నించి పంత్‌‌ కేవలం 31 వన్డేలు మాత్రమే ఆడాడు. కొవిడ్‌‌కు ముందు 11, తర్వాత 15 వన్డేలు ఆడిన పంత్‌‌ ఆ తర్వాత కారు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఆ టైమ్‌‌లో ఓ సెంచరీ, రెండుసార్లు 75 ప్లస్‌‌, ఓసారి 80కి పైగా స్కోర్లు చేశాడు. కానీ కారు ప్రమాదం నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొలంబోలో ఒకే ఒక్క వన్డే ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో పంత్‌‌ ప్లేస్‌‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. వికెట్‌‌ కీపర్‌‌ కమ్‌‌ బ్యాటర్‌‌గా రాహుల్‌‌ ప్లేస్‌‌ సుస్థిరం చేసుకున్నప్పటికీ రెండో కీపర్‌‌ కోసం జురెల్‌‌, పంత్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ మధ్య పోటీ నెలకొని ఉంది. శ్రేయస్‌‌ అయ్యర్‌‌, దేవదత్‌‌ పడిక్కల్‌‌, శుభ్‌‌మన్‌‌ గిల్‌‌, యశస్వి జైస్వాల్‌‌ కూడా రేసులో ఉండటంతో జట్టు ఎంపిక సెలెక్టర్లకు తలనొప్పిగా మారింది. టీ20 వరల్డ్‌‌ కప్‌‌ను దృష్టిలో ఉంచుకుని బుమ్రా, హార్దిక్‌‌ పాండ్యాకు రెస్ట్‌‌ ఇవ్వనున్నారు. దాంతో హర్షిత్‌‌ రాణా, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌కు చాన్స్‌‌ దక్కొచ్చు. మహ్మద్‌‌ షమీ కూడా వస్తాడని ఊహాగానాలు మొదలయ్యాయి. స్పిన్నర్లుగా జడేజా, సుందర్‌‌, కుల్దీప్‌‌కు అవకాశం దక్కనుంది.