దేశీయ శాస్త్రీయ ప్రగతికి అవరోధాలు

దేశీయ శాస్త్రీయ ప్రగతికి అవరోధాలు

మానవాభివృద్ధిలో  సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.  ప్రకృతి పరిశీలన ద్వారా ఆర్జించే విజ్ఞానమే సైన్స్. ఆ  విజ్ఞానాన్ని మానవాళి శ్రేయస్సు కోసం  వినియోగించే ప్రక్రియనే  టెక్నాలజీ. 21వ శతాబ్దంలో  సాంకేతికతతో  ముందుకెళ్లిన  దేశాలే  పైచేయి సాధిస్తాయి.   ఆ దిశలో   భారత్ కూడా ముందుకు వెళుతున్నది.  ఆధునిక యుగ అవసరాలకు అనుగుణంగా శాస్త్ర,  సాంకేతికతను అన్ని రంగాలలో విస్తరించారు.  

ఇది దేశ వ్యవసాయ, పారిశ్రామిక,  సాఫ్ట్​వేర్,  కమ్యూనికేషన్,  విద్య,  వైద్య , ఆరోగ్య , రక్షణ,  అణుశక్తి,  అంతరిక్ష రంగాల అభివృద్ధికి  నాంది పలికింది. స్వాతంత్ర్యనంతరం  దేశంలో  పరిశోధన కేంద్రాలను , విశ్వవిద్యాలయాలను, ఐఐటి వంటి  ఆధునిక సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేశారు.  మరోవైపు  భారత  ప్రభుత్వం ఎప్పటికప్పుడు శాస్త్ర సాంకేతిక విధానాలతో  ముందుకెళ్లడం, దేశీయ అవసరాలకనుగుణంగా వీటి లక్ష్యాలు నిర్దేశించడం జరుగుతోంది.

గత కొంతకాలంగా మనదేశంలోని శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ  నూతన ఆవిష్కరణలు మనల్ని అగ్రరాజ్యాల సరసన నిలబెడుతున్నాయి. ఇటీవల చేపట్టిన చంద్రయాన్ -3,  ఆదిత్య ఎల్1 కార్యక్రమాలే  దీనికి  నిదర్శనం.  భారతదేశం  గ్లోబల్  ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII)- 2023లో  ప్రపంచంలోని 132 ఆర్థిక వ్యవస్థలలో 40వ స్థానానికి చేరుకుంది.

(2015 సంవత్సరంలో 81 వ స్థానం).  దీంతో 37 దిగువ -మధ్య  ఆదాయ  గ్రూపు ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 1వ స్థానంలో నిలవడం సానుకూలంశం.  అన్ని రంగాల్లో నవీకరణ, వ్యవస్థాపకతలతో  అంకుర సంస్థల స్థాపన పెరుగుతోంది. 100 కోట్ల  డాలర్ల విలువ గల అంకుర సంస్థలను యూనికార్న్​లని  అంటారు.  భారత్ 67 యూనికార్న్ లతో  అమెరికా,  చైనా తర్వాత  మూడవ స్థానంలో నిలిచింది.  

ఇవి ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తున్నాయి.  ఒక వైపు  శాస్త్ర,  సాంకేతికతతో దూసుకు పోతున్నప్పటికి...  సంస్థాగత వైఫల్యాలు మనల్ని వెనక్కి నెట్టుతున్నాయి.  భారతీయ విద్యాసంస్థలు  ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో  పోటీపడకపోవడం బాధాకరం.  మన దేశ ఉత్పత్తులు ప్రపంచాన్ని శాసించడం లేదు.  భారత్ లో తయారీ కార్యక్రమం అమలవుతున్నప్పటికీ  ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు, సెమీ కండక్టర్ చిప్స్,  భారీ యంత్రాలు,  ఆర్గానిక్ కెమికల్స్,  ప్రధాన ఆయుధాలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం.  స్వావలంబన సాధించలేకపోతున్నాం. ఇది భారతదేశానికి పెద్ద అవరోధం. 

అరకొర నిధులు

మన దేశంలో పరిశోధన అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధులు కేటాయింపు జరగకపోవడమే దీనికి కారణం.  అభివృద్ధి చెందిన దేశాల్లో ఏటా కనీసం రెండు నుంచి నాలుగు శాతం వరకు నిధులు ఖర్చు కేటాయిస్తుండగా.. మన దేశంలో 0.7 శాతం లోపే.  ఇప్పటివరకు శాస్త్ర, సాంకేతిక రంగంలో అపూర్వ విషయాలు అరకొర నిధులతోనే సాధించాం.  21వ  శతాబ్దపు అవసరాలను తీర్చడానికి ఈ వ్యయాన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది.

మరోవైపు  భారతదేశంలో  సూడో సైన్స్ (అసత్య సైన్సు) ప్రచారం  వైజ్ఞానిక  ప్రగతికి అవరోధంగా మారింది.  ఇటీవల పతంజలి ఉత్పత్తులపై  తప్పుదారి  పట్టించే  ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం  తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే.  ఇలాంటివి  ప్రజలను  గందరగోళానికి గురిచేస్తాయి. మరోవైపు  శాస్త్రీయ  ఆచైతన్యంతో ప్రజల్లో  మూఢత్వ భావాల వ్యాప్తి పెరుగుతోంది.  ఇది ఆందోళన కలిగించే విషయం.  పాఠ్య పుస్తకాల్లో  సైతం  వాస్తవ శాస్త్రీయ విజ్ఞానం ఉండడం లేదు. తద్వారా దేశంలో ఛాందస భావాల పరిధి పెరిగి  సైన్స్ పరిధి తగ్గుతుంది.

కృత్రిమ మేధ ప్రయోజనాలు, ప్రమాదాలు

వికసిత్ భారత్ 2047  సహకారంలో  సాంకేతికత  కీలక పాత్ర  పోషించనుంది.  రోజూ రోజుకు  తరిగిపోతున్న  వనరులతో  దేశ జనాభా అవసరాలను తీర్చడానికి శాస్త్ర,  సాంకేతికత అభివృద్ధి అత్యవసరం.  ప్రస్తుతం బిగ్ డేటా,  కృత్రిమ మేధ,  మెషిన్ లెర్నింగ్,  రోబోటిక్స్ ,  ఇంటర్నెట్ ఆఫ్ థింక్ వంటి  ఆధునిక సాంకేతికత ప్రపంచాన్ని శాసిస్తోంది.  వీటి ఆధారిత కోర్సులను చదవడం వల్ల  మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు.  

భవిష్యత్తులో  ప్రతి రంగాన్ని కృత్రిమ మేధ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  కృత్రిమ మేధ,  రోబోలతో  ఆధునిక మానవుడు అవతరించనున్నాడు.  వీటి ప్రభావంతో  ఉద్యోగాల స్వరూప స్వభావాలు  కూడా మారుతున్నాయి. అంతేకాకుండా  కృత్రిమ మేధ  టెక్నాలజీతో ప్రమాదం కూడా పొంచి ఉందనేది కాదనలేని సత్యం.  కృత్రిమ మేధ  సాంకేతిక  వినియోగంతో  డీప్‌‌‌‌ ఫేక్‌‌‌‌ల  సృష్టి  పెరగడమే  దీనికి  ప్రధాన కారణం.

ఇటీవల దీన్ని ఎ న్నికల్లో వాడి అసత్యప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇది  వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత,  గౌరవం మొదలుకొని  జాతీయ భద్రత దాకా అన్నిటికీ  ముప్పుగా మారుతున్నది.  సైబర్ క్రైమ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. కావున,  సాంకేతిక  అభివృద్ధితో పాటు  నియంత్రణ కూడా  అవసరమని నిపుణులు భావిస్తున్నారు.  

సైన్స్ విద్యను  ప్రభుత్వాలు ప్రోత్సహించాలి

ప్రభుత్వాలు సైన్స్ విద్యను ప్రోత్సహించాలి.  పాఠశాల స్థాయి నుంచి  యూనివర్సిటీ స్థాయి వరకు సైన్స్ విద్యలో నాణ్యతను పెంచాలి. ముఖ్యంగా  ప్రయోగాపూర్వక విద్యనందించాలి.  గ్రీన్  టెక్నాలజీపై  దృష్టి పెట్టి  భూగోళ  సంరక్షణకు తోడ్పడాలి.  శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్,  మేథమెటిక్ (STEM) రంగాలలో మహిళా భాగస్వామాన్ని పెంచాలి.  దేశవ్యాప్తంగా పరిశోధనలకు పెద్దపీట వేయడానికి  గతేడాది  నేషనల్  రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు.  ఇది పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యమిచ్చి మేధో వలసలను అరికట్టాలి.  అప్పుడు నూతన ఆవిష్కరణలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.  తద్వారా సుస్థిర అభివృద్ధికి బాటలు పడతాయి.

- సంపతి రమేష్ మహరాజ్,సోషల్​ ఎనలిస్ట్​