జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లు
  • గత అక్టోబరుతో పోలిస్తే 4.6 శాతం ఎక్కువ
  • రేట్లను తగ్గించడంతో నెమ్మదించిన జీఎస్‌‌టీ వసూళ్ల పెరుగుదల

న్యూఢిల్లీ:  జీఎస్టీ వసూళ్లు పెరగడం ఈసారి నెమ్మదించింది. గత నెల స్థూల జీఎస్​టీ వసూళ్లు రూ. 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరం అక్టోబర్​లో రూ. 1.87 లక్షల కోట్లు వసూలు కాగా, ఈసారి కేవలం 4.6 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇదే అతి తక్కువ వృద్ధి రేటు. జీఎస్​టీ రేట్ల తగ్గింపు ప్రభావం ఈ నెలకు సంబంధించిన వసూళ్లపై కనిపించింది. 

సెప్టెంబర్ 22 (నవరాత్రుల మొదటి రోజు) నుంచి వంట సామాగ్రి నుంచి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ దాకా 375 వస్తువులపై జీఎస్​టీ రేట్లు తగ్గించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సగటున 9 శాతం వృద్ధి ఉండగా, అక్టోబర్​లో అది 4.6 శాతానికే పరిమితమైంది. ఆగస్టు​లో రూ.1.86 లక్షల కోట్లు వసూలు కాగా, 6.5 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్​లో రూ. 1.89 లక్షల కోట్లు వచ్చాయి.  

స్థూల దేశీయ ఆదాయం 2 శాతం పెరిగి రూ. 1.45 లక్షల కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన పన్ను సుమారు 13 శాతం పెరిగి రూ. 50,884 కోట్లుగా నమోదైంది. దిగుమతులకు సంబంధించిన ఐజీఎస్​టీ దాదాపు 13 శాతం పెరిగింది.   జీఎస్​టీ రీఫండ్స్ 39.6 శాతం పెరిగి రూ. 26,934 కోట్లుగా ఉన్నాయి.