ODI World Cup 2023: పాక్‌కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం.. 345 కొట్టినా ఓటమి

ODI World Cup 2023: పాక్‌కు కలిసిరాని ఉప్పల్ స్టేడియం.. 345 కొట్టినా ఓటమి

వన్డే ప్రపంచ  కప్ 2023‌ పోరును ఘనంగా ఆరంభించాలనుకున్న పాకిస్తాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో  పాక్‌  5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 345 పరుగుల భారీ స్కోరు చేయగా.. అంత పెద్ద లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ చేధించారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ జట్టు.. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (103; 94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (80), సౌద్ షకీల్ (75) అర్ధ శతకాలతో రాణించారు. కివీస్ బౌలర్లలో మిషెల్ శాంట్నర్ 2 వికెట్లు తీసుకోగా.. మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. 

అనంతరం 345 పరుగుల లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు మరో 38 బంతులు మిగిలివుండగానే చేధించారు. ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర (94; 72 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్) పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా.. కెప్టెన్ కేన్ విలియంసన్ (54), డారీ మిచెల్(59), మార్క్ చాప్ మెన్ (65) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో ఉసామా మీర్ 2 వికెట్లు తీసుకోగా.. హసన్ అలీ, అఘా సల్మాన్, మహ్మద్ వసీం జూనియర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇక ఇదే వేదికపై అక్టోబర్ 3న పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది.