అది ఇల్లా.. నోట్ల కట్టల గోదామా.. ఆ ఇల్లంతా నోట్ల కట్టలే.. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి రేంజ్ ఇదీ..!

అది ఇల్లా.. నోట్ల కట్టల గోదామా.. ఆ ఇల్లంతా నోట్ల కట్టలే.. ప్రభుత్వ ఉద్యోగి అవినీతి రేంజ్ ఇదీ..!

భువనేశ్వర్: కటక్ సర్కిల్ గనుల డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతిని రూ. 30,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో ఒడిశా విజిలెన్స్ అధికారులు అరెస్టు చేశారు. భువనేశ్వర్‌లోని ఆయన ఫ్లాట్, ఇతర ప్రదేశాలలో సోదాలు నిర్వహించగా, రూ. 4 కోట్లకు పైగా డబ్బు దొరికింది. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇప్పటివరకు ఇంత మొత్తంలో ఒక అధికారి ఇంట్లో దొరకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆయన ఆఫీస్ లోని టేబుల్ డ్రాయర్ నుంచి లక్షా 20 వేలు స్వాధీనం చేసుకున్నారు.

భువనేశ్వర్‌లో రెండంతస్తుల బిల్డింగ్, సుమారు 130 గ్రాముల బంగారం, ఇంకా చాలా అక్రమాస్తులను ఈ ప్రభుత్వ అధికారి కూడబెట్టాడు. ఇంట్లో ట్రాలీ బ్యాగుల్లో ప్యాక్ చేసిన రూ.4 కోట్ల రూపాయల నోట్ల కట్టలను చూసి విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు. మంగళవారం రాత్రి విజిలెన్స్ డిపార్ట్మెంట్ దేబబ్రత మొహంతిని అరెస్ట్ చేసింది. భువనేశ్వర్‌లోని ఒక ఫ్లాట్ నుంచి మొత్తం రూ.4 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

బొగ్గు డిపోను నడుపుకోవడానికి అనుమతి కోసం ఒక వ్యాపారి మొహంతిని కలిశాడు. రూ. 30,000 లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు విజిలెన్స్ ను ఆశ్రయించాడు. మొహంతి బాధితుడి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెండ్గా దొరికిపోయాడు. అతని అరెస్టు తర్వాత.. విజిలెన్స్ విభాగం భువనేశ్వర్లోని అతని ఫ్లాట్లో, భద్రక్ జిల్లాలోని అతని తల్లిదండ్రుల ఇంట్లో, కటక్‌లోని అతని ఆఫీస్లో ఏక కాలంలో సోదాలు జరిపింది. భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.