ఎలాంటి లాభాన్ని ఆశించకుండా భారత్కు కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ ప్రకటించింది. భారత్లో వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రభుత్వ అగ్రిమెంట్లతో టీకాలు అందజేస్తామని స్పష్టం చేసింది. అందరికీ టీకా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపింది. అయితే.. ఏ ధరకు టీకాను అందజేస్తారనే విషయం మాత్రం ఫైజర్ ప్రకటించలేదు.
దేశంలో కరోనా ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకొని టీకా అవసరాల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ను వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఇతర దేశాల్లో ఆమోదం పొందిన సమర్థమైన టీకాలను భారత్లో కూడా అనుమతించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నాయి. ఇప్పటివరకు దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు మాత్రమే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాకు గ్రీన్ సిగ్నల్ లభించినప్పటికీ..ఇంకా అందుబాటులోకి రాలేదు.
