ఆపదలో ఆదుకునేందుకు రెడీ .. 300 మంది ‘ఆపదమిత్రలు’గా ఎంపిక .. ట్రైనింగ్ కంప్లీట్

ఆపదలో ఆదుకునేందుకు రెడీ .. 300 మంది ‘ఆపదమిత్రలు’గా ఎంపిక .. ట్రైనింగ్ కంప్లీట్
  • వరదల నేపథ్యంలో మూడు నెలల ప్రణాళికతో పూర్తి సన్నద్ధత
  • ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది స్థానికంగా ఉండేలా ప్లానింగ్
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానికులతో వాట్సాప్ గ్రూప్
  • వర్షాలు, వరద సమాచారం ఎప్పటికప్పుడు తెలిపేలా ఏర్పాట్లు
  • కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నెంబర్​ 1077 అందుబాటులోకి.. 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో వరదలు, ఆపదలు వచ్చినప్పడు ఆదుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గత రెండేండ్ల నుంచి భారీ వర్షాల కారణంగా మున్నేరు, ఆకేరు పోటెత్తడంతో వేలాది కుటుంబాలు ఇబ్బందులు పడడంతో, ఈసారి ఆ పరిస్థితి రాకుండా ముందస్తు ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. 300 మంది ఆపదమిత్రలను ఎంపిక చేసి, వారికి 10 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు ఖమ్మం కలెక్టరేట్ లో 1077 టోల్ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు చేశారు. అవసరమైతే మూడు నెలల పాటు ఎన్డీఆర్ఎఫ్​ టీమ్​ లు ఖమ్మంలో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానికులకు కూడా ముందస్తు సన్నద్ధతపై అవగాహన కల్పించారు. 

రిలీఫ్​ క్యాంపులను గుర్తించి అక్కడ అన్ని వసతులను సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి, విద్యుత్, నీటి పారుదల శాఖ, ఆశా కార్యకర్త, అంగన్​వాడీ టీచర్లతో డిజాస్టర్ టీమ్​లను ఏర్పాటు చేశారు. వచ్చే బుధవారం మాక్ డ్రిల్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించి, విపత్తు సమాచారం క్షేత్రస్థాయికి చేరుతుందో లేదో పరిశీలించాలని నిర్ణయించారు. ప్రతి గ్రామంలో గజ ఈతగాళ్లను గుర్తించి, మండలంలో అవసరమైన బోట్, ఇతర సామగ్రి అందుబాటులో పెట్టాలని నిర్ణయించారు. వల్నరబుల్ ప్రాంతాల్లోని ఇండ్లకు ముందస్తుగా జిప్ లాక్ బ్యాగ్ అందించి  ముఖ్యమైన సర్టిఫికెట్లు, కాగితాలు, డబ్బులు, నగలు అందులో భద్రపర్చుకొనే విధంగా ఏర్పాటు చేస్తున్నారు.  

కీలకంగా ఆపదమిత్రలు..! 

వరదలు, అగ్ని ప్రమాదాల లాంటి ఆపద సమయాల్లో వేగంగా స్పందించేందుకు అన్ని జిల్లాల్లో ఆపదమిత్రలను అధికారులు ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మంలో 300 మందిని సిద్ధంచేశారు. ఖమ్మం నగరంలో 12 డివిజన్ లను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ప్రతి డివిజన్​ లో 20 మంది వాలంటీర్లను గుర్తించి శిక్షణ ఇచ్చారు. గతేడాది వరద వచ్చిన ప్రాంతాల్లో 300 మంది యువతీ యువకులు, మహిళలను ఆపదమిత్రలుగా ఎంపిక చేసి, వారికి విజయవాడ నుంచి వచ్చిన 20 మంది నేషనల్ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​ (ఎన్డీఆర్ఎ
ఫ్​) సభ్యులతో ట్రైనింగ్ ఇప్పించారు. 

వరదలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా బయటపడవచ్చు, సీపీఆర్ ఎలా చేయాలి, దాని ప్రాముఖ్యత లాంటి అంశాలను వివరించారు. ఆపదమిత్రలతో పాటు ఆయా వరద ప్రభావిత కాలనీల్లోని కొందరు స్థానికులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సోషల్ మీడియా గ్రూపులను ఏర్పాటు చేశారు. ఆ గ్రూపుల ద్వారా వర్షాలు, వరదలకు సంబంధించిన సమాచారాన్ని, అలర్ట్ లను అందరికి చేరవేసేందుకు ప్లాన్​ చేశారు. వీటితో పాటు స్టేట్ డిజాస్టర్​ రెస్పాన్స్​ ఫోర్స్​ (ఎస్డీఆర్ఎఫ్) కు చెందిన కొత్తగూడెం బెటాలియన్​ నుంచి 30 మందిని రప్పించారు. వారిని 10 మంది చొప్పున మూడు టీమ్​ లుగా విభజించగా గతేడాది వరదలు వచ్చిన కాలనీల్లో పర్యటించి, వరదల సమయంలో ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పిస్తున్నారు. 

1077 టోల్​ ఫ్రీ నెంబర్​ ఏర్పాటు 

వర్షాకాలం వరదలతో ఇబ్బంది వస్తే ఇన్ఫర్మేషన్​ ఇచ్చేలా టోల్ ఫ్రీ నెంబర్​ ను ఖమ్మం కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. జూన్​ 15 నుంచి సెప్టెంబర్​ 30 వరకు 1077 టోల్ ఫ్రీ నెంబర్ సిద్ధం చేశారు. ఏదైనా ఆపద వచ్చిన సమయంలో సమాచారం ఇచ్చేందుకు, సహాయం పొందేందుకు ఈ టోల్ ఫ్రీ నెంబర్​ కు ఫోన్​ చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం వర్షాకాలానికి సంబంధించిన సన్నద్ధతపై అధికారులతో జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ (డీడీఎంపీ) సమావేశాన్ని ఖమ్మం కలెక్టర్​ అనుదీప్ దురిశెట్టి నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు సహా, గ్రామ, మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ పని చేసే స్థానాల్లో, ఆయా ఊర్లలోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్​ ఆదేశించారు. 

గత రెండేండ్లుగా భారీ వర్షాలు, వరదలు

ఖమ్మం నగరాన్ని గత రెండేండ్ల నుంచి వరదలు ముంచెత్తడంతో భారీ ఆస్తి నష్టంతో పాటు, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న మున్నేరుకు 2023లో 34 అడుగుల మేర వరద రాగా, 2024 సంవత్సరంలో దాదాపు 40 అడుగుల వరద వచ్చింది. వరంగల్, మహబూబాబాద్​ జిల్లాల నుంచి వచ్చే ఆకేరు ప్రవాహం ఎక్కువగా రావడం, ఆ వరద మున్నేరులో కలవడంతో ఎక్కువ నష్టం జరిగింది. ఎస్డీఆర్ఎఫ్​, ఎన్డీఆర్ఎఫ్​ టీమ్​ లు ముందుగా లేకపోవడం, అధికారులు కూడా వరద ఉధృతిని ఊహించకపోవడం లాంటి అనేక కారణాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈక్రమంలో ఈసారి ఆఫీసర్లు ముందస్తు చర్యలు తీసుకున్నారు. 

అంతా సిద్ధంగా ఉన్నాం 

ముందస్తు ప్రణాళికలతో మా అధికారుల టీమ్​ సిద్ధంగా ఉంది. వర్షాలు, వరదలపై జిల్లా డిజాస్టర్​ మేనేజ్​ మెంట్ ప్లాన్​ సమావేశాన్ని నిర్వహించాం. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం రిహాబిలిటేషన్ సెంటర్ లను గుర్తిస్తున్నాం. ఏ ప్రాంతం ప్రజలను ఎక్కడికి తరలిస్తారు అనే విషయమై మ్యాపింగ్ చేసి సోమవారం వరకు ఇవ్వాలని ఆఫీసర్లకు చెప్పాం. వాతావరణ శాఖ నుంచి వరద ముప్పు ఉందని హెచ్చరిక రాగానే జిల్లాలో హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవాలని,  వరద సమయంలో అవసరమైన బోట్లు, రోప్స్, లైఫ్ జాకెట్, మైక్స్, లైట్లు, జేసీబీ, క్లీనింగ్ ఎక్విప్మెంట్ మొదలగు సామగ్రి డివిజన్, గ్రామం వారీగా అందుబాటులో ఉంచుతున్నాం. వరద తర్వాత పారిశుధ్య నిర్వహణకు సంబంధించి సిబ్బంది, జవాన్ లను ఇళ్ల వారీగా కేటాయించేందుకు ప్లాన్​ చేశాం.  - అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం కలెక్టర్​