
- అందుబాటులోకి స్పెషల్ యాప్
- ప్రతి గ్రూప్లో ఇద్దరికి లాగిన్ అవకాశం
హైదరాబాద్, వెలుగు: డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు ఈజీగా అందనున్నాయి. ఇప్పటివరకు సీసీ వద్ద ఉన్న ట్యాబ్ ద్వారా అప్పు కోసం అప్లై చేసుకునేవారు. ఇకపై మహిళా సంఘం సభ్యులే నేరుగా లోన్ కోసం తమ స్మార్ట్ ఫోన్ ద్వారా అప్లై చేసుకునేలా ‘మన స్త్రీ నిధి’ పేరిట యాప్ను అధికారులు డిజైన్ చేశారు. పైలెట్ ప్రాజెక్టుగా వెయ్యి డ్వాక్రా గ్రూపుల్లో దీన్ని అమలు చేశారు. త్వరలో రాష్ట్రమంతా ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
యాప్ ఇలా పనిచేస్తది
ఒక్కో డ్వాక్రా గ్రూప్లో స్మార్ట్ ఫోన్ కలిగిన ఇద్దరు సభ్యుల సెల్ నంబర్లను ఇప్పటికే స్త్రీ నిధి అధికారులు సేకరించారు. ఆ ఇద్దరు తమ ఫోన్లలో ‘మన స్త్రీ నిధి’ యాప్ లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి. అందులో గతంలో ఆ టీమ్ సభ్యులు తీసుకున్న లోన్, పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. సభ్యుల వేలిముద్ర లేదా ఐరిష్ ద్వారా లోన్కు అప్లై చేయగానే స్త్రీ నిధి అధికారులకు మెసేజ్ వెళ్తుంది. వారు పరిశీలించి అప్లికేషన్ వచ్చిన 24 గంటల్లోనే లోన్ మంజూరు చేస్తారు. ఈ యాప్ను త్వరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్లోకి అందుబాటులోకి వస్తుంది.
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుతో ఒప్పందం
రుణాలు పొందిన మహిళలు తమ కిస్తీలను బ్యాంకుల్లో లేదా అందుబాటులో ఉన్న బ్యాంకులకు సంబంధించిన బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద చెల్లిస్తున్నారు. ఈ సౌకర్యాలు లేని గ్రామాలు వేలాదిగా ఉన్నాయి. దీంతో స్త్రీ నిధి అధికారులు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ఎయిర్టెల్ పేమెంట్ పాయింట్స్ రాష్ట్రంలో సుమారు 1,500 గ్రామాల్లో ఉన్నాయి. వీటిల్లోనూ మహిళలు స్త్రీ నిధి లోన్ కిస్తీలు కట్టొచ్చు.