బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి భారీ మొత్తంలో నగదు, మద్యాన్ని అధికారులు సీజ్ చేశారు. మార్చి 16 నుంచి ఇప్పటివరకు రూ.45.67 కోట్ల నగదు, రూ.146 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే, 1,544 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని వెల్లడించింది. మొత్తం రూ.292.74 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు సీజ్ చేశామని గురువారం ఒక ప్రకటనలో ఈసీ తెలిపింది.
ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచీ రూ.45.67 కోట్ల నగదు, రూ.146 కోట్ల విలువైన మద్యం, రూ.9.70 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.10.81 విలువైన బంగారాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్లు, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఈ మేరకు కర్నాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం వెల్లడించింది. రూ.7.73 కోట్ల గిఫ్ట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఎక్సైజ్ శాఖలో 1,938 కేసులు, 2,400 లైసెన్స్ సంబంధిత కేసులు, 118 ఎన్డీపీఎస్, కర్నాటక ఎక్సైజ్ యాక్ట్ 1965 కింద 11,790 కేసులను నమోదు చేశారు. దీంతో పాటు 1,172 వెహికల్స్ను సీజ్ చేశారు.