డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశాలు.. నంద్యాలోని థియేటర్లలో అధికారుల తనిఖీలు

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశాలు.. నంద్యాలోని థియేటర్లలో అధికారుల తనిఖీలు

అమరావతి: ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి, ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్స్, మాల్స్‎లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం  (మే 29) నంద్యాల పట్టణంలోని పలు థియేటర్లను ఆకస్మికంగా రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. 

థియేటర్‎కు సంబంధించిన పత్రాలు, సేఫ్టీ ప్రికాషన్స్‎ను పరిశీలించారు. థియేటర్లో ఉన్న క్యాంటీన్లు, బాత్రూంలు, టికెట్ల రేట్లు గురించి థియేటర్ నిర్వహకులను అడిగి తెలుసుకున్నారు. థియేటర్‎కు వచ్చే ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాల కల్పించాలని థియేటర్ యాజమాన్యానికి సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. 2025, జూన్ 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ చేస్తామని ఫిల్మ్ ఎగ్జిబిటర్లు ప్రకటించారు. పవన్ సినిమా విడుదలకు ముందు థియేటర్లు బంద్ చేస్తామనం వెనక కుట్ర ఉందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. 

దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గుత్తాధిపత్యం నడుస్తోందని.. థియేటర్లలో పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. పవన్ ఆదేశాలతో సంబంధింత అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా  థియేటర్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.