వాణిజ్య సిలిండర్ ధరలు, విమాన ఇంధన ధరలపై చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.25.5 తగ్గించాయి. అటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ ధరను 4.5శాతం తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. ఏటీఎఫ్ ధరపై రూ.5,527.17 తగ్గించారు. దీంతో దిల్లీలో విమాన ఇంధన ధర కిలో లీటరుకు రూ.1,15,520.27గా ఉంది. తాజా తగ్గింపు ధరలు అక్టోబరు 1 నుంచే అమల్లోకి వచ్చాయి.
నగరాల వారీగా ధరలు..
చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించిన ధరల ప్రకారం..19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 1,859.50గా ఉంది. ముంబైలో రూ. 32.5 తగ్గడంతో సిలిండర్ ధర రూ. 1811.50కి చేరుకుంది. కోల్కతాలో రూ. 36.5 తగ్గడంతో...రూ. 1959 అయింది. చెన్నైలో రూ. 35.5 తగ్గింది. హైదరాబాద్లో రూ.36.50 తగ్గడంతో.... 19 కేజీల కమర్షియల్ సిలిండర్ రూ.2063గా ఉంది. వరంగల్లో రూ.2102గా ఉంది.
ఇది ఆరోసారి..
అంతర్జాతీయంగా ఇంధన ధరలు తగ్గడంతోనే దేశీయంగా వీటి ధరలు తగ్గాయి. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడం గత జూన్ నుంచి ఇది ఆరోసారి. ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్ పై మొత్తంగా రూ.494.50 తగ్గించారు. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చివరగా జులై 6న మాత్రమే రూ.50 పెరిగింది. ఆ తర్వాత మళ్లీ పెరగలేదు.