అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ పంటకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పంట సాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం (సెప్టెంబర్ 07) భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రి తనిఖీ చేశారు. ఆయిల్ పామ్ గెలలు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్రషింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట జిల్లాలో త్వరలో ఆయిల్ పామ్ రిఫైనరీని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. రాష్ట్రాన్ని ఆయిల్ పామ్ హబ్ గా మార్చుతామని చెప్పారు. అనంతరం రాజేంద్రనగర్ కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ నాలుగో సంవత్సరం స్టూడెంట్లు అశ్వారావుపేట మండలం గంగారం గ్రామంలోని మంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు.
జీవ రసాయన ఎరువులతో పంటల సాగుపై శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయిల్ పామ్ ఓఎస్డీ కిరణ్, అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీ అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, బండి భాస్కర్, నాగబాబు పాల్గొన్నారు.
