
Ola EV Loses: ప్రతి త్రైమాసికం గడుస్తున్న కొద్ది ఈవీ టూవీలర్ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ పరిస్థితి దిగజారుతోంది. ఒకప్పుడు ఈవీ టూవీలర్ల అమ్మకాల్లో రారాజుగా వెలిగిన కంపెనీ అమ్మకాలు పడిపోవటంతో మూడవ స్థానానికి వచ్చింది. ప్రస్తుతం కంపెనీ వాటా మార్కెట్లో 20 శాతం తగ్గిపోవటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈవీ టూవీలర్ సెగ్మెంట్లో టీవీఎస్ తొలి స్థానంలో ఉండగా బజాజ్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఏడాది కాలంలో ఓలా మార్కెట్ షేర్ 50 శాతం వరకు కోల్పోయిందని తేలింది.
ALSO READ | IT News: హైదరాబాద్ ఐటీ కంపెనీ విచిత్రం : కుక్కను చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్గా నియామకం
అయితే తాజాగా కంపెనీ తన నాల్గవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర నష్టం రెండింతలై రూ.870 కోట్లుగా నమోదైంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నష్టాలు ఇదే కాలంలో కేవలం రూ.416 కోట్లుగా నమోదయ్యాయి. ఈవీ స్కూటర్ల మార్కెట్లో భారీగా పెరిగిన పోటీ, ప్రభుత్వం నుంచి తగ్గిన ప్రోత్సాహకాలు దీనికి కారణంగా తెలుస్తోంది. ఇదే క్రమంలో మార్చి క్వార్టర్లో కంపెనీ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 62 శాతం తగ్గి రూ.611 కోట్లుగా నమోదైంది.
ఓలా ఎలక్ట్రిక్ 2021లో దేశంలో తన టూవీలర్ ఈవీల విక్రయాన్ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం నాల్గవ త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు సగానికి తగ్గి 51వేల 375 యూనిట్లకు పరిమితం అయ్యింది. అయితే మార్జిన్లు స్వల్పంగా మెరుగుపడినప్పటికీ దేశవ్యాప్తంగా ఈవీ టూవీలర్ల అమ్మకాల్లో కొనసాగుతున్న మందగమనం కంపెనీకి భారీ దెబ్బగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కంపెనీ లాంచ్ చేసిన జెన్ 3 ఈవీలు 11 శాతం తక్కువ ఖర్చుతో 20 శాతం మెరుగైన పనితీరుతో వస్తున్నాయని కంపెనీ వెల్లడించింది.
భారత్ బ్యాటరీ వివాదం..
ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ భారత్ సెల్ పేరుతో ప్రత్యేక బ్యాటరీలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని ట్రేడ్ మార్కింగ్ విషయంలో లిథియం అయాన్ బ్యాటరీ తయారీ సంస్థ కూష్మాండ్ పవర్ లిమిటెడ్, ఓలా ఎలక్ట్రిక్ మధ్య వివాదం కొనసాగుతోంది. దీనిపై తాజాగా దిల్లీ హైకోర్టు సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే ప్రస్తుతం ఈ రెండు సంస్థలకు ఈ పేరుతో ఎలాంటి ట్రేడ్ మార్క్ లేకపోవటంతో వివాదం ముదిరింది. ఆగస్టులో ఈ కేసు తర్వాతి హియరింగ్ కి రానుంది.