పాతది కూల్చి కొత్తది కట్టుడే

పాతది కూల్చి కొత్తది కట్టుడే

సెక్రటేరియెట్ పై మంత్రి
వేములతో సీఎం సమీక్ష
కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై చర్చ 

పాత సెక్రటేరియెట్ ను కూల్చి దాని స్థానంలో కొత్తది కట్టాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై గురువారం రాత్రి ప్రగతిభవన్ లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డితో సీఎం కేసీఆర్ చర్చించారు. ఇప్పుడున్న సెక్రటేరియెట్ లో మార్పులు చేర్పులు చేయడం ద్వారా ఫైర్‌ సేఫ్టీ, ఇతర భద్రత ప్రమాణాలు, సౌకర్యాలు కల్పించడం సాధ్యంకాదని, అందువల్ల కొత్త సెక్రటేరియెట్‌ కాంప్లెక్స్ ను నిర్మించాలని టెక్నికల్‌ కమిటీ ఇటీవల తన రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అందజేసింది.

ఈ నివేదికను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి నేతృత్వం లోని కేబినెట్ సబ్ కమిటీ తన అభిప్రాయాలతో కూడిన నివేదికను నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కు సమర్పిం చింది. కేబినెట్ సబ్ కమిటీ కూడా టెక్నికల్ కమిటీ అభిప్రాయాన్ని సమర్థించింది. ఇప్పుడున్న సెక్రటేరియట్ బిల్డింగ్ లు కొనసాగించడానికి ఏ మాత్రం అనువుగా లేవని, కొత్త సెక్రటేరియెట్ కట్టాల్సిందేనని కేబినెట్ సబ్ కమిటీ తేల్చింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై వేముల ప్రశాంత్​రెడ్డితో గురువారం రాత్రి సీఎం చర్చించారు.