ఈ బామ్మ మనసు బంగారం 

ఈ బామ్మ మనసు బంగారం 

కొవిడ్​ ఎంతోమంది జీవితాలను దెబ్బతీసింది.  87 ఏళ్ల​ ఉషాగుప్తా జీవితంలో కూడా విషాదం నింపింది. అరవై ఏళ్లు తనే ప్రాణంగా బతికిన భర్తని కొవిడ్​ పట్టుకెళ్లింది. సెకండ్​ వేవ్​లో 27 రోజులు చావుబతుకుల మధ్య పోరాడి ఉష భర్త రాజ్​ కుమార్​ చనిపోయాడు. కానీ, ఆ బాధతోనే కాలం వెళ్లదీయాలనుకోలేదు ఆమె. తన భర్తలా కొవిడ్ బారిన పడిన వాళ్లకోసం తనకు చేతనైన సాయం చేయాలనుకుంది. కరోనా  ట్రీట్​మెంట్​కి డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకి చెయ్యి అందించాలనుకుంది. అందుకోసం 87 ఏళ్ల వయసులో పచ్చళ్ళు అమ్మడం మొదలుపెట్టింది ఈ బామ్మ. జూలైలో మనవరాలు రాధిక సాయంతో కొవిడ్​ బాధితుల కోసం పచ్చళ్ళ బిజినెస్​ మొదలుపెట్టింది. ‘పికిల్స్​​ విత్​ లవ్’​ పేరుతో  200 గ్రాముల పచ్చళ్ళ బాటిల్స్​​ని 150 రూపాయలకి అమ్ముతోంది. ఈ పచ్చడి సీసాలని కలర్​ఫుల్​ రిబ్బన్స్​తో డెకరేట్​ చేసి, ఒక నోట్​ రాసి అంటిస్తోంది. బామ్మ ఆలోచనతో పాటు టేస్ట్​ కూడా బాగుండటంతో పచ్చళ్ళ కోసం కస్టమర్స్​ క్యూ కడుతున్నారు. మరీ ముఖ్యంగా బామ్మ చేతి వెజిటబుల్, చింతకాయ పచ్చళ్ళకి  ఫ్యాన్స్​ విపరీతంగా ఉన్నారు.​  ఎగబడి కొంటున్నారు. అలా సంపాదించిన డబ్బంతా కొవిడ్​ బాధితుల కోసమే ఖర్చు చేస్తున్న  ఈ బామ్మ మనసు బంగారం!