
సంగారెడ్డి, వెలుగు : కొత్త పింఛన్ల ప్రొసీడింగ్ కాఫీలకు లబ్ధిదారులకు కష్టాలు మొదలైనయ్… ఇప్పుడే ఇట్లుంటే పింఛన్లు ఇచ్చేటప్పుడు ఇంకేన్ని బాధలు పెడతరో అంటూ లబ్ధిదారులు వాపోతున్నరు. ప్రొసీడింగ్ కాపీల కోసం ఆరు గంటలకు వెయింట్ చేయించడంతో వృద్ధులు, దివ్యాంగుల, వితంతువులు కడుపు మాడ్చుకుని తిట్టుకుంటూ ఇంటికి పొయిన్రు. సంగారెడ్డి జిల్లా పొతిరెడ్డి పల్లిలో శనివారం ఆసరా పింఛన్లకు సంబంధించిన ప్రొసీడింగ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనికి ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్తదితరులు హాజరయ్యారు. ప్రోగ్రామ్ మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఆఫీసర్లు, లోకల్ లీడర్లు సంగారెడ్డి నియోజకవర్గంలోని లబ్ధిదారును ఉదయం 11గంటలకే రమ్మన్నరు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు, నేత, గీత కార్మికులందరూ పొద్దున్నే వచ్చి కూర్చున్నరు. అయితే ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు తీరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి మీటింగ్ స్టార్ట్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరు గంటలు వెయిట్ చేసి చేసి తిండి తిప్పలు లేక నీరసించిన లబ్ధిదారులు కొందరు ఓపిక నశించి మధ్యలోనే వెళ్లిపోయారు. మరి కొందరు భోజనం లేకపోయిన ఓపిక పట్టి ప్రొసీడింగ్లు తీసుకున్నరు.
ఇంత నిర్లక్ష్యమా..?
పొద్దంతా వెయిట్ చేయించి లబ్ధిదారుల కడుపులు మాడ్చిన ప్రజాప్రతినిధులు మాత్రం స్థానికంగా ఓ టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో భోజనాలు చేసి తీరిగ్గా ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యారు. వృద్ధులు, వికలాంగులను పట్టించుకోకుండా తీరిగ్గా భోజనం చేసి ప్రోగ్రామ్కు ఆలస్యంగా రావడం విమర్శలకు దారి తీసింది. దీంతో సాయంత్రం 4:30 గంటలకు భోజనాలు ఏర్పాటు చేసి పెట్టి ఇంటికి పంపించారు.