2026 T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన ఒమాన్, నేపాల్.. ఇప్పటివరకు క్వాలిఫై అయిన 19 జట్లు ఇవే !

2026 T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన ఒమాన్, నేపాల్.. ఇప్పటివరకు క్వాలిఫై అయిన 19 జట్లు ఇవే !

ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న 2026 టీ20 వరల్డ్‌ కప్‌కు ఒమాన్, నేపాల్ జట్లు అర్హత సాధించాయి. నిన్నటివరకు 17 జట్లు అర్హత సాధించగా.. తాజాగా 18, 19వ జట్లుగా ఒమన్ నేపాల్ నిలిచాయి. మొత్తం 20 జట్లు ఆడే ఈ పొట్టి సమరంలో ఒక్క జట్టు మాత్రమే మిగిలి ఉంది. మస్కట్ వేదికగా జరిగిన ఆసియా క్వాలిఫైయర్స్‌లోని ‘సూపర్ సిక్స్’ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి నేపాల్ అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఒమన్ జట్టు కూడా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత సాధించింది.

సమోవా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, మలేషియా, జపాన్, పాపువా న్యూ గినియా జట్లలో ఒక జట్టు వరల్డ్ కప్ కు అర్హత సాధించనుంది. ఆతిధ్య దేశాలైన భారత్, శ్రీలంక నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధిస్తాయి. 2024 టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 కు అర్హత సాధించిన దేశాలు 2026 వరల్డ్ కప్ కు తమ బెర్త్ లు ఖాయం చేసుకున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఈ లిస్టులో ఉన్నాయి. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ సూపర్ 8 కు అర్హత సాధించకపోయినా  ర్యాంకింగ్స్ పరంగా అర్హత సాధించాయి. దీంతో 20 జట్లలో క్వాలిఫై మ్యాచ్ లు ఆడకుండానే ఈ 12 టీమ్స్ 2026 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి.

క్వాలిఫయర్స్ ద్వారా కెనడా కూడా అర్హత సాధించి 13 వ జట్టుగా నిలిచింది. ఆ తర్వాత ఇటలీ, నెదర్లాండ్స్, జింబాబ్వే, నమీబియా క్వాలిఫై అయ్యాయి. తాజాగా ఒమాన్, నేపాల్ అర్హత సాధించడంతో ఇప్పటివరకు 17 జట్లు టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించాయి. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ ఫైనల్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కన్ఫర్మ్ కాగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 

2007లో తొలిసారి టీ20 ప్రపంచ కప్ ప్రారంభమైంది. అప్పటి నుంచి పొట్టి సమరాన్ని రెండేళ్ల కొకసారి నిర్వహిస్తూ వస్తున్నారు. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడడం తప్పితే ప్రతి రెండు సంవత్సరాలకు ఐసీసీ ఈ టోర్నీ నిర్వహిస్తూ వస్తుంది. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. గత ఏడాది జరిగిన 2024 టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా ముగిసిన ఫైనల్లో సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.