మే 12న జీవో నంబరు ఒకటిపై ఏపీ హైకోర్టు తీర్పు 

మే 12న జీవో నంబరు ఒకటిపై ఏపీ హైకోర్టు తీర్పు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 2వ తేదీన తీసుకొచ్చిన జీవో నంబరు ఒకటిని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం (మే 12వ తేదీ) హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై ఈ ఏడాది జనవరి 24న లోతైన విచారణ జరిపి.. తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే.

రహదారులపై బహిరంగ సభలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు, ఇతర రాజకీయ పార్టీల గొంతు నొక్కడం కోసమే ప్రభుత్వం జీవో ఒకటి తీసుకొచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్‌ వేశారు. ఇదే జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో వ్యాజ్యాలు వేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు రహదారులపై నిర్వహించే కార్యక్రమాలను జీవో నంబరు ఒకటి పేరుతో అడ్డుకునే ప్రమాదం ఉందని, అందువల్ల ఈ జీవోను రద్దు చేయాలని కోరారు. రహదారులపై రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు, రోడ్‌ షోలను కట్టడి చేసేందుకే  జీవో నంబరు ఒకటిని తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.