హైదరాబాద్, వెలుగు: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని, వీటిని సరిదిద్దాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ కోరారు. రిక్రూట్మెంట్లో అన్యాయం జరిగినవారికి పోస్టింగ్స్ ఇవ్వాలని బుధవారం హోంశాఖ మంత్రి మహమూద్ అలీని కలిసి విన్నవించారు. లాస్ట్ కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు రాలేదని వివరించారు. స్టూడెంట్ల మార్కులు, రిజర్వేషన్ కేటగిరీ వివరాలు ఇవ్వడం లేదని తెలిపారు.
పోస్టులు 16,925 ఉంటే 16,025 మాత్రమే భర్తీ చేశారని, మిగతా 900 పోస్టులు ఎందుకు నింపలేదన్నారు. నార్మలైజేషన్ పేరుతో కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ మార్కులు వేసి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నార్మలైజేషన్ ప్రాసెస్ను రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించారు. అవకతకవకలను సరిదిద్దకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు.