శివరాత్రికి ఎములాడ రెడీ

శివరాత్రికి ఎములాడ రెడీ
  • 3 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం
  • రూ.కోటి 65 లక్షల అంచనాతో ఏర్పాట్లు
  • 1500 మంది పోలీసులతో బందోబస్తు
  • హెల్త్​ డిపార్ట్​మెంట్ ​ఆధ్వర్యంలో 16 చోట్ల వైద్య శిబిరాలు 
  • స్పెషల్ ​బస్సులు  నడిపించనున్న ఆర్టీసీ

వేములవాడ, వెలుగు: వేములవాడ  శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవ స్థానం మహా శివరాత్రి జాతరకు ముస్తాబవుతోంది. మార్చి1న మహా శివరాత్రి ఉండగా, ఈ నెల 28 నుంచి వచ్చే నెల ఫస్టు తారీఖు వరకు దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్​ జయంతి​, ఎస్పీ రాహుల్​ హెగ్డే, ఈఓ రమాదేవి పరిశీలించారు. భక్తులకు కావాల్సిన వసతి గృహాలు, చలువపందిళ్లు, ట్రాన్స్​పోర్టేషన్, డ్రింకింగ్​వాటర్, లైటింగ్​, పారిశుద్ధ్యంపై దృష్టి సారించారు. లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకునే చాన్స్ ఉన్నందున టౌన్​ను క్లీన్​గా ఉంచేందుకు ఆలయం నుంచి, మున్సిపాలిటీ నుంచి, ఇతర జిల్లాల్లోని మున్సిపల్‌ కార్మికులు, టెంపరరీ కార్మికుల సేవలను వినియోగించుకోనున్నారు. భక్తుల ఆహ్లాదం కోసం గుడి చెరువు గ్రౌండ్​లో శివార్చన పేరిట కల్చరల్​ప్రోగ్రామ్స్​ నిర్వహించనున్నారు. వీటి కోసం రూ. రూ. 50 లక్షలు వెచ్చించనున్నారు. -మొత్తంగా రూ.కోటి 65 లక్షల అంచనాతో పనులు చేస్తున్నారు. భద్రత కోసం1500 మంది పోలీసులు పని చేయనున్నారు. సీసీ కెమెరాలను బిగించడంతో పాటు భక్తులకు ఏదైనా సమస్య తలెత్తితే సంప్రదించడానికి పోలీస్​కంట్రోల్​రూమ్ ​సిద్ధం చేశారు.  

ఆలయానికి 500 పైగా వసతి గదులుండగా, లక్షల్లో వచ్చే భక్తుల కోసం రూ. 35 లక్షలతో 3 లక్షల చదరపు అడుగుల్లో చలువ పందిళ్లు వేస్తున్నామని ఈఈ రాజేశ్​ తెలిపారు. గుడి చెరువు, ఆలయ పరిసరాలు, భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ టెంపుల్, అంబేద్కర్​ రోడ్​లో వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎండా కాలం వస్తున్నందున చలివేంద్రాలు, మజ్జిగ ప్యాకెట్స్​, వాటర్​ప్యాకెట్స్,  పాలు, పండ్లు పంపిణీతో పాటు హాట్​వాటర్ అందిస్తామన్నారు. భక్తుల కోసం హెల్ప్​డెస్క్​ రెడీ చేస్తున్నామన్నారు.  

జాతరకు 770 ప్రత్యేక బస్సులు

జాతర కోసం 770 ప్రత్యేక జాతర బస్సులను నడిపిస్తున్నట్టు ఆర్టీసీ ఆర్ఎం శ్రీధర్ తెలిపారు. వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు 14 ఫ్రీ మినీ బస్సు సర్వీసులు 24 గంటల పాటు తిరుగుతాయన్నారు. ఈ సేవలు ఆలయ సహకారంతో ఈ నెల 28నుంచి 1వ తారీఖు వరకు కొనసాగుతాయన్నారు. వరంగల్, నర్సంపేట, హైదరాబాద్, కరీంనగర్, కోరుట్ల, మెట్ పల్లి, ఆర్మూర్, నిర్మల్, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డిల నుంచి బస్సులను నడిపిస్తామన్నారు.  

16  హెల్త్​క్యాంప్​లు 

జాతర సందర్భంగా16  హెల్త్ క్యాంప్స్​ఏర్పాటు చేస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా. సుమన్​మోహన్​రావు తెలిపారు. తిప్పాపూర్‌, జగిత్యాల బస్టాండ్​ప్రాంతం, నాంపల్లిగుట్ట, అమ్మవారి కాంప్లెక్స్‌, రాజేశ్వరపురం, మెయిన్​ టెంపుల్​ ముందు, సంస్కృత కాలేజీల్లో ఈ క్యాంప్స్​ ఉంటాయన్నారు. ఎమర్జెన్సీ కోసం ఆరు అంబులెన్స్​లు ఏర్పాటు చేస్తున్నారు.