యాదాద్రి భువనగిరి జిల్లా: అతివేగం ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ దగ్గర హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ డ్రైవింగ్ తో వచ్చిన ఓ కారు.. ముందు వెళ్తున్న రెండు బైక్ లతో పాటు.. మరో కారును ఢికొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజు అనే వ్యక్తి చనిపోగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. కారు ఢి కొట్టగానే.. ఓ బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు అంటుకున్నాయి. దీంతో బైక్ పూర్తిగా తగలబడిపోయింది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు గాయపడినవాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
బ్రేకులు ఫెయిల్ కావడంతోనే..
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డ్రైవర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కారు బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్ది సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ప్రేమ పెళ్లికని వెళ్తుండగా..
మృతుడు నాగరాజు హయత్నగర్ చెందిన వాడిగా తెలిసింది. శ్రీలత అనే యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నాగరాజు.. ఆమెను ప్రేమ పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఈక్రమంలో ప్రేమికులిద్దరు చెరువుగట్టు వద్ద వివాహం చేసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదానికి గురై అనూహ్యంగా ప్రాణాలు విడిచారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుదామనుకున్న శ్రీలత, నాగరాజు అకాల మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇదే..