
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, యూటీలకు జీఎస్టీ కాంపెన్సేషన్ కింద గత నాలుగు నెలల్లోనే రూ. లక్ష కోట్లను కేంద్రం విడుదల చేసింది. 17 వ వీక్లి ఇన్స్టాల్మెంట్ రూ. 5 వేల కోట్లను 23 రాష్ట్రాలకు, 3 యూటీ (ఢిల్లీ, జమ్ము అండ్ కాశ్మీర్, పుదుచ్చెరి)లకు శుక్రవారం కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్టోబర్, 2020 నుంచి రూ. లక్ష కోట్లను రాష్ట్రాలు, యూటీలకు ప్రభుత్వం రిలీజ్ చేసినట్టయ్యింది. ఈ డబ్బులను స్పెషల్ బారోవింగ్ విండో ద్వారా రిలీజ్ చేశారు. మిగిలిన ఐదు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం లకు జీఎస్టీ అమలు చేయడం వలన ఎటువంటి రెవెన్యూ గ్యాప్ ఏర్పడలేదు. జీఎస్టీ అమలు చేయడం వలన ఏర్పడిన రూ. 1.10 లక్షల కోట్ల రెవెన్యూ గ్యాప్ను రాష్ట్రాలకు అందించేందుకు కిందటేడాది అక్టోబర్లో ప్రభుత్వం ఓ స్పెషల్ బారోవింగ్ విండోని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 91 శాతం జీఎస్టీ కాంపెన్సెషన్ను 23 రాష్ట్రాలకు, 3 యూటీలకు రిలీజ్ చేసిందని ఫైనాన్స్ మినిస్ట్రీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.