టాటా గ్రూప్ చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం అతిపెద్ద విషాదం: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

టాటా గ్రూప్ చరిత్రలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదం అతిపెద్ద విషాదం: టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‎లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం టాటా గ్రూప్ చరిత్రలోని అతిపెద్ద విషాదమని టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్‎గా చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ సహోద్యోగులకు చంద్రశేఖరన్ శుక్రవారం (జూన్ 13) లేఖ రాశారు. ఇందులో అహ్మదాబాద్ ప్రమాదం గురించి వివరించారు. 

‘‘అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వివరించలేనిది. మేము ఇంకా షాక్, దుఃఖంలో ఉన్నాము. మనకు తెలిసిన ఒక వ్యక్తిని కోల్పోవడమే విషాదం. అలాంటిది ఒకేసారి ఇన్ని మరణాలు సంభవించడం అర్థం చేసుకోలేనిది. టాటా గ్రూప్ చరిత్రలో ఇది చీకటి రోజు’’ అని పేర్కొన్నారు. 

విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి యూకే, అమెరికా నుండి దర్యాప్తు బృందాలు అహ్మదాబాద్ చేరుకున్నాయని తెలిపారు. దర్యాప్తు బృందాలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామన్నారు. నమ్మకమైన సంస్థగా ప్రయాణికుల భద్రతే మా తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత విషంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు.

కాగా, గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. 

ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక ప్రయాణికుడు తప్ప మిగిలిన అందరూ సజీవ దహనమయ్యారు. మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ రూ.కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.