16 గేట్ల ద్వారా 3 లక్షల 70 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
వస్తున్న వరదను వస్తున్నట్లే.. దిగువకు విడుదల
నల్గొండ: నాగార్జునసాగర్ డ్యామ్ కు వరద ప్రవాహం భారీగా పరవళ్లు తొక్కుతోంది. డ్యా మ్ వద్ద 16 గేట్ల ద్వారా దిగువకు 3 లక్షల 70 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్ర, కర్నాటక, ఏపీల మీదుగా వరద పోటెత్తుతుండడంతో వస్తున్న వరద ప్రవాహాన్ని నిల్వ చేసే అవకాశం లేక వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. నిన్న రాత్రి వరకు 18 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసిన అధికారులు ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో రెండు గేట్లు దించి మొత్తం 16 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు.
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 3 లక్షల 70 వేల 757 క్యూసెక్కులు…వస్తుండగా.. వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులతో 312.0405 టీఎంసీలు… కాగా.. ప్రస్తుతం 587 అడుగుల నీటి మట్టంతో 305.8030 టీఎంసీలు నిల్వ ఉంచుతున్నారు. ఎగువన శ్రీశైలం నుండి వరద తగ్గితే.. అందుకు అనుగుణంగా సాగర్ డ్యామ్ వద్ద కూడా గేట్లు కూడా దించి వరదను కంట్రోల్ చేస్తున్నారు.