ఉత్తరప్రదేశ్,  పంజాబ్ లో కొనసాగుతున్న పోలింగ్

ఉత్తరప్రదేశ్,  పంజాబ్ లో కొనసాగుతున్న పోలింగ్

5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పర్వం మొదలైంది. ఉత్తరప్రదేశ్ లో మూడు విడత,  పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు  ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో 1,304 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.... వారిలో 93 మంది మహిళలు ఉన్నారు. 2 కోట్ల 14 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.సాయంత్రం 6 గంటల  వరకు పోలింగ్ కొనసాగుతోంది.

పంజాబ్  ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు.  సీఎం చరణ్ జిత్  సింగ్  చన్నీ చమ్ కౌర్  సాహిబ్ , భదౌర్  స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్  ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్ధి భగవంత్  మాన్  ధురి నియోజకవర్గ బరిలో నిలిచారు. పంజాబ్  పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్  సింగ్ సిద్ధూ అమృత్ సర్  తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్  సింగ్  తమ కుటుంబానికి గట్టి పట్టున్న పటియాలా అర్బన్  బరిలో నిలిచారు. అకాలీదళ్  చీఫ్ సుఖ్ బీర్  బాదల్ .... జలాలాబాద్ , ఆయన తండ్రి ప్రకాశ్  సింగ్ బాదల్ .. లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

పంజాబ్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ , ఆమ్  ఆద్మీ పార్టీ మధ్యే ఉన్నా శిరోమణి అకాలీదళ్ సహా బీజేపీ కూటమి కూడా బరిలో నిలిచింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలకు పంజాబ్  కేంద్రంగా నిలిచింది. ఈ అంశమే కలిసి వస్తుందని కాంగ్రెస్ , ఆప్  రెండూ ధీమాగా ఉన్నాయి.

ఖరార్ లో గురుద్వార్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం చరణ్ జిత్ సింగ్. పంజాబ్ లో మంచి సర్కార్ రావాలని ప్రార్థనలు చేశానన్నారు  చన్నీ. ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్  మాన్ గురుద్వార్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.