సోలార్​ గోల్డ్​ కోట్ - వాట్సాప్​తోనే నడిపించిన్రు

సోలార్​ గోల్డ్​ కోట్ - వాట్సాప్​తోనే నడిపించిన్రు
  •     డబుల్ లాభాలు వస్తాయని కోట్లు కొట్టేశారు
  •     రెండు నెలల పాటు ఇచ్చి
  •     మూడో నెల నుంచి ముంచిన్రు
  •     ఉమ్మడి మహబూబ్​నగర్​లోనే వెయ్యి మంది బాధితులు  
  •     వాట్సాప్​లో చాటింగ్​..
  •     ఫోన్​పే, గూగుల్​పేతో పేమెంట్​
  •     రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది బాధితులు

వనపర్తి, వెలుగు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్త తరహా ఆన్​లైన్​మోసం వెలుగు చూసింది. ‘సోలార్​ గోల్డ్​ కోట్’ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే నెల నెలా లాభాలు వస్తాయని చెప్పి రూ.కోట్లు ముంచారు. కేవలం ఫోన్లు మాత్రమే చేస్తూ పెట్టుబడిదారులంటూ పెద్ద పెద్ద పేర్లు చెప్పి...కంపెనీకి వచ్చే లాభాల నుంచి డబ్బులు ఇస్తామని చెప్పి ఒప్పించారు. దీని కోసం ప్రత్యేకంగా వాట్సాప్​ గ్రూప్​లను క్రియేట్​ చేశారు. ఒకటి రెండు నెలల పాటు అకౌంట్లలో డబ్బులు జమవుతుండటంతో తమ పంట పండిందని బాధితులు భ్రమపడ్డారు. వీరిని చూసి మరికొంతమంది పెట్టుబడులు పెట్టారు. ఇలా వేల సంఖ్యలో సభ్యులు చేరడంతో కంపెనీ బోర్డు తిప్పేసింది. రెండు, మూడు రోజులుగా వెబ్​సైట్​ఓపెన్​కాకపోవడం, ఫోన్లు స్విచ్ఛాఫ్​వస్తుండడం, ఎలాంటి సమాచారం రాకపోవడంతో మోసపోయామని బాధితులు తెలుసుకున్నారు.

భారత ప్రభుత్వ అనుమతి ఉందంటూ.. 

సోలార్ ​గోల్డ్​ కోట్​ మోసాలు రాష్ట్రవ్యా ప్తంగా ఉన్నప్పటికీ ఉమ్మడి మహబూబ్​నగర్​లోనే వెయ్యి మందికి పైగా బాధితులు ఉండి ఉంటారని అంచనా. కొన్ని నెలల కింద కొంతమందికి ఫోన్లు చేసిన చీటర్స్​ తమ బిజినెస్ ​ఎలా నడుస్తుందో వివరించారు. www.solar --goldcoat.cc, www.solar--goldcaot.com వెబ్​సైట్లలో కంపెనీ వ్యాపార వివరాలు ఉన్నాయని నమ్మబలికారు. తమ సోలార్​​పవర్ ​ప్రాజెక్టుకు భారత ప్రభుత్వ అనుమతి ఉన్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వీరు పంపే ఆన్​లైన్ ​లింక్ ఓపెన్ ​చేసి లాగిన్ ​అవ్వగానే పేరు, వివరాలు, ఫోన్​ నెంబర్​, ఈమెయిల్​ఐడీ, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. బిజినెస్​ యాక్టివ్​ కావాలంటే వారి దగ్గర ఉన్న ప్లాన్లలో ఏదో ఒకటి తీసుకోవాలి. తమ దగ్గర రూ.600 నుంచి రూ. లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చని, డబ్బులను ఫోన్​పే, గూగుల్​పే చేస్తే చాలని నమ్మించారు. వీరి ప్లాన్​లో భాగంగా 30 వాల్టుల సోలార్​ప్యానల్​లో రూ.400 పెట్టుబడి పెడితే 45 రోజుల్లో రూ.648 చెల్లించారు. 70 వాల్టుల సోలార్ ​ప్యానల్​లో రూ.1100 కడితే 50 రోజుల్లో రూ. 2035 తిరిగిచ్చారు. ఇలా పెట్టుబడి పెరిగిన కొద్దీ లాభాలు పెంచుకుంటూ పోయారు. ఒక దశలో రూ.లక్షా మూడు వేలు కడితే180 రోజులకు రూ.8, 52, 840 ఇస్తామని చెప్పడంతో చాలామంది డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేశారు. అయితే ఇందులో ఎవరికీ డబ్బులివ్వలేదు.  

వాట్సాప్​తోనే నడిపించిన్రు

90 వాట్సాప్​ గ్రూపులు క్రియేట్ ​చేసిన మోసగాళ్లు  ఒక్కో గ్రూపులో 256 మంది చొప్పున 25 వేల మందిని చేర్చుకున్నట్టు తెలుస్తోంది. తమకు డబ్బులు వచ్చాయంటే.. తమకు వచ్చాయంటూ కంపెనీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ గ్రూపుల్లో పెట్టుబడిదారుల్లా స్క్రీన్​షాట్స్​పెడితే, అవి చూసిన మిగతా వారు ఆవేశ పడి డబ్బులు కుమ్మరించారు. వీటన్నింటికి ఇద్దరు, ముగ్గురు అడ్మిన్లు ఉండేవారని సమాచారం. 99533 21221 నంబర్ ​నుంచి మహిళ మాట్లాడేదేని, రెండు, మూడు రోజులుగా ఆ నంబర్ పని చేయడం లేదని, వెబ్​సైట్​ ఓపెన్ ​కావడం లేదని బాధితులు చెబుతున్నారు. ఆ నంబర్​ వాట్సాప్ ​డీపీలో కైలియా సింగ్​అని చూపెడుతోందని, ఈ విషయమై సైబర్​క్రైం పోలీసులకు కంప్లయింట్​చేయనున్నట్టు బాధితులు సయ్యద్​ అక్బర్, మహిమూద్​ చెప్పారు.