హైదరాబాద్,వెలుగు: ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం ఆన్ లైన్ ఫిర్యాదుల విభాగాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం ప్రభుత్వ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ఈ విభాగాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఆన్లైన్ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సోమేశ్కుమార్ తెలిపారు. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియేట్ గ్రీవియెన్స్ రిడ్రెసల్ సిస్టమ్(బిగ్ఆర్ఎస్) పేరుతో ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని, తమ ఫిర్యాదుల స్టేటస్ను సెల్ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. ‘బిగ్ఆర్సీ’ పేరుతో ఒకటీ, రెండు రోజుల్లో యాప్ రానుందని, వారం రోజుల్లో తెలుగు వెబ్ సైట్ప్రారంభిస్తామన్నారు.
ఇంటర్ పరీక్షల నిర్వహణపై త్రిమెన్ కమిటీ ఇచ్చిన ఆరు సిఫారసులనూ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈసారి పరీక్షల్లో ఒక్క తప్పు జరగడానికి వీలు లేదన్నారు. పరీక్షల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్, జీమెయిల్ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉమర్ జలీల్ తెలిపారు. కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, ఇంటర్ బోర్డు అధికారులు జయప్రదబాయి, రాణి, సుశీల్కుమార్, లక్ష్మారెడ్డి, ఖలిక్ తదితరులు పాల్గొన్నారు.