వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం ఆలయంలో ఈవో కృష్ణ ప్రసాద్ వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఇక నుంచి భక్తులు vemulawadatemple.telangana. gov.in ద్వారా అన్ని రకాల ఆర్జిత సేవలను ఆన్లైన్లో బుక్చేసుకోవచ్చన్నారు.
అలాగే వెబ్ సైట్ లో ఆలయంలో ప్రతి రోజు జరిగే పూజల వివరాలు, సమయాలు చూసుకోవచ్చన్నారు. కోడె కట్టడం, రుద్రాభిషేకం , అన్నపూజ , అభిషేకం (నాగిరెడ్డి మంటపం)-, ఆకుల పూజ, కుంకుమ పూజ , శివ కళ్యాణం , చండీ సహీత రుద్రహోమం, మహా లింగార్చన, పెద్దసేవ, పల్లకీ సేవ, వాహన పూజ, సత్యనారాయణ వ్రతం, కేశ ఖండనం, గండాదీపం తదితర సేవలను ఇక నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చన్నారు.
అనుబంధ ఆలయాలైన భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ ఆలయం, నగరేశ్వర ఆలయాల సమాచారాన్ని కూడా పొందుపరిచామన్నారు. ఈ–డొనేషన్ కాలమ్లో హుండీకి భక్తులు, అన్నదానానికి దాతలు కానుకలు పంపవచ్చన్నారు. రాజన్న ఆలయానికి రాష్ర్టంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ర్ట, చత్తీస్గఢ్ ల నుంచి భక్తులు వస్తుంటారు. దీంతో వీరికి టెంపుల్లో జరిగే పూజలు, ఇతర వివరాలు తెలియకపోయేది. వెబ్సైట్అందుబాటులోకి రావడంతో ఇక నుంచి తిప్పలు తప్పనున్నాయి.