స్వదేశీ ఆవిష్కరణ శక్తికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనం: జెన్ టెక్నాలజీస్ సీఎండీ అశోక్ అట్లూరి

స్వదేశీ ఆవిష్కరణ శక్తికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనం: జెన్ టెక్నాలజీస్ సీఎండీ అశోక్ అట్లూరి

హైదరాబాద్, వెలుగు: స్వదేశీ ఆవిష్కరణ శక్తికి ఆపరేషన్ సిందూర్ ఓ ఉదాహరణ అని ఫిక్కీ నేషనల్ డిఫెన్స్, హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్యాండ్ సెక్యూరిటీ కమిటీ కో చైర్, జెన్ టెక్నాలజీస్ సీఎండీ అశోక్ అట్లూరి తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను శక్తివంతం చేయడమే లక్ష్యంగా భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) ఆధ్వర్యంలో హైదరాబాద్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక 'ఎంఎస్ఎంఈ ఎక్సలరేట్ 2025’ను జెన్ టెక్నాలజీస్ సీఎండీ అశోక్ అట్లూరి, ఎన్ఎస్ఐసీ జోనల్ హెడ్, జీఎం వీ సురేష్ బాబు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా అశోక్ అట్లూరి మాట్లాడుతూ మన దేశంలో తయారైన డ్రోన్లు, డిటెక్టర్లు, జామర్లు, రాడార్లతో చైనా డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు. ఆర్ అండ్ డీ అనేది ఒక వృథా ఖర్చు కాదని, ఎంతో అవసరమని అన్నారు. ఎంఎస్ఎంఈలు ఎంత బిజీగా ఉన్నా, పరిశోధనలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సరైన దిశను గుర్తించి దానిపై దృష్టి పెట్టితే విప్లవాత్మక మార్పులు సాధ్యమన్నారు. 

భారతదేశం అంతర్జాతీయంగా ముందంజలో నిలవాలంటే లోకల్ మార్కెట్లకే కాకుండా, ప్రపంచ మార్కెట్ల కోసం కూడా ఆవిష్కరణలు చేయాలన్నారు. అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా దీర్ఘకాలిక విజయాలను సాధించవచ్చన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్ డీ మన దేశాన్ని గ్లోబల్ నాయకత్వం వైపు తీసుకెళ్తుందన్నారు. ఇకపై భారతదేశంలో పెట్టుబడి పెద్ద అడ్డంకి కాదన్నారు.  

సురేష్ బాబు మాట్లాడుతూ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న ఐఎస్ఓ సర్టిఫైడ్ సంస్థ అన్నారు. ఇది దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టార్ యూనిట్లకు ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను విక్రయించేందుకు కీలక భూమిక పోషిస్తున్నామని తెలిపారు.