బిజినెస్డెస్క్, వెలుగు: విమాన కంపెనీలు ఎన్ని ఫ్లయిట్లను నడపాలో ఇప్పటి వరకు నియంత్రిస్తూ వచ్చిన ప్రభుత్వం, తాజాగా ఈ రిస్ట్రిక్షన్లను తొలగించింది. కంపెనీలు తమ ఫుల్ కెపాసిటీతో ఈ నెల 18 నుంచి ఆపరేషన్స్ను కొనసాగించొచ్చని తెలిపింది. ‘షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఆపరేషన్లను, ఎయిర్ ప్యాసెంజర్ల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఫ్లయిట్లను ఆపరేట్ చేయడంలో కంపెనీలపై ఉన్న రిస్ట్రిక్షన్లను ఎత్తేస్తున్నాం. ఈ నెల 18 నుంచి ఈ ఆర్డర్స్ అమల్లోకి వస్తాయి’ అని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. కరోనా సంక్షోభం వలన కిందటేడాది మే నుంచి ఎయిర్లైన్ కంపెనీల కెపాసిటీపై రిస్ట్రిక్షన్లు కొనసాగుతున్నాయి. అప్పుడు కరోనా ముందు స్థాయిలో కేవలం 33 శాతం కెపాసిటీతోనే ఆపరేట్ చేయాలని ప్రభుత్వం రిస్ట్రిక్షన్లు పెట్టింది. కిందటేడాది డిసెంబర్ నాటికి ఈ లిమిట్ను 80 శాతానికి పెంచారు. కరోనా సెకెండ్ వేవ్ వలన ఈ ఏడాది మే లో మళ్లీ లిమిట్ను 50 శాతానికి తగ్గించారు. ప్రస్తుతం 85 శాతం కెపాసిటీతో ఎయిర్లైన్ కంపెనీలు పనిచేస్తున్నాయి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాదిత్య సింధియా పదవిలోకి వచ్చిన మూడు నెలల్లోనే కెపాసిటీ రిస్ట్రిక్షన్లను తొలగించారు.
పండగ సీజన్తో విమాన సర్వీస్లకు డిమాండ్..
కరోనా డెల్టా వేరియంట్ విస్తరించడంతో గ్లోబల్గా చాలా దేశాల్లో విమాన ప్రయాణాలు తగ్గిపోయాయి. కానీ, ఇండియాలో మాత్రం క్రమంగా విమాన ప్రయాణాలు పెరగడం గమనించొచ్చు. వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఊపందుకోవడంతో పాటు, ఫెస్టివ్ సీజన్ స్టార్టవుతుండడంతో దేశంలో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ నెల 9 న ఏకంగా 3,04,020 మంది ప్యాసెంజర్లు విమానాల ద్వారా ప్రయాణం చేశారు. ఇది కరోనా ముందు స్థాయిలో 71.5 శాతానికి సమానం. చివరి సారిగా 3 లక్షల మంది ప్రయాణికుల మార్క్ను ఈ ఏడాది ఫిబ్రవరి 28 న ఎయిర్లైన్ కంపెనీలు టచ్ చేయగలిగాయి. ‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్ను చూడడానికి ప్రయణాలు చేయడం, ఇతర ట్రావెలింగ్స్ వలన ట్రావెల్ బుకింగ్స్ పెరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి’ అని ఇగ్జిగో ఫౌండర్ అలోక్ బాజ్పాయ్ అన్నారు. అడ్వాన్స్గా టికెట్స్ బుక్ చేసుకుంటే ఎయిర్లైన్ ఛార్జీలు కూడా తగ్గుతున్నాయి. కిందటి నెలలో డొమెస్టిక్ ఎయిర్ట్రాఫిక్ పెరిగిందని ఇక్రా డేటా చెబుతోంది. ఈ నెంబర్ 2–3 శాతం పెరిగి 69 లక్షలకు చేరుకుందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ తో పోలిస్తే ఈ సెప్టెంబర్లో డొమెస్టిక్ ఎయిర్లైన్ కంపెనీలు 54 శాతం ఎక్కువ ట్రాఫిక్తో పనిచేశాయని ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. కిందటి నెలలో ఎయిర్లైన్ కంపెనీలు 61,100 డిపార్చర్స్ (ఫ్లయిట్స్ బయలుదేరడం) రికార్డ్ చేశాయి. ఇది కిందటేడాది సెప్టెంబర్లో 39,628 గా ఉంది. ‘ఈ ఏడాది సెప్టెంబర్లో సగటున రోజుకి 2,100 డిపార్చర్స్ జరిగాయి. కిందటేడాది ఇదే నెలలో జరిగిన సగటు రోజువారి డిపార్చర్స్ 1,321 కంటే ఇవి చాలా ఎక్కువ. ఈ ఏడాది ఆగస్ట్లో 1,900 డిపార్చర్స్ రికార్డయ్యాయి. కానీ, ఈ ఏడాది జనవరిలో నమోదైన 2,200 కంటే మాత్రం సెప్టెంబర్లో జరిగిన డిపార్చర్స్ తక్కువగా ఉన్నాయి’ అని ఇక్రా పేర్కొంది.