
- రూ.4.24 లక్షలు పోగొట్టుకున్న పీజీ విద్యార్థి
- క్యాంపస్ హాస్టల్లో గడ్డి మందు తాగి సూసైడ్
- మృతుడిది జగిత్యాల జిల్లా కోరుట్ల
ఓయూ, వెలుగు: బిట్ కాయిన్లో ట్రేడింగ్ చేసి నష్టపోయిన ఓయూ పీజీ స్టూడెంట్.. క్యాంపస్ హాస్టల్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం రూ.4.24 లక్షలు పోగొట్టుకుని అప్పులపాలైనట్టు పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కార్పెంటర్ ఎర్ర శ్రీనివాస్ కొడుకు ఎర్ర నవీన్ (23) ఓయూ క్యాంపస్లో ఎంకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. క్యాంపస్లోని మంజీరా హాస్టల్ రూమ్ నంబర్ 14లో ఉంటున్నాడు. ఆన్లైన్ గేమ్స్కు బానిసైన నవీన్.. కొంత కాలంగా బిట్ కాయిన్లో పెట్టుబడులు పెట్టాడు. మొత్తం రూ.4.24 లక్షలు నష్టపోయాడు. చదువు కోసం డబ్బులు అవసరమని చెప్తుండటంతో.. తండ్రి అప్పులు చేసి మనీ పంపించాడు.
ఆ డబ్బులన్నింటినీ బిట్ కాయిన్లో పెట్టి నష్టపోయాడు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు ఏడాది కాలంగా నవీన్ ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు పార్ట్టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయినా, ఆ డబ్బులు వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి హాస్టల్లోని గడ్డి మందు తాగాడు. వాంతులు చేసుకోవడంతో గమనించిన తోటి విద్యార్థులు చీఫ్ వార్డెన్కు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం నవీన్ను హాస్టల్ దగ్గర్లో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చీఫ్ వార్డెన్ డాక్టర్ శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు గాంధీ హాస్పిటల్కు తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ చనిపోయాడు. డాక్టర్లు పోస్టుమార్టం చేసి డెడ్బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.