బిట్​కాయిన్ ట్రేడింగ్​లో నష్టం.. ఓయూ స్టూడెంట్ ఆత్మహత్య

బిట్​కాయిన్ ట్రేడింగ్​లో నష్టం.. ఓయూ స్టూడెంట్ ఆత్మహత్య
  • రూ.4.24 లక్షలు పోగొట్టుకున్న పీజీ విద్యార్థి
  • క్యాంపస్ హాస్టల్​లో గడ్డి మందు తాగి సూసైడ్
  • మృతుడిది జగిత్యాల జిల్లా కోరుట్ల

ఓయూ, వెలుగు: బిట్ కాయిన్​లో ట్రేడింగ్ చేసి నష్టపోయిన ఓయూ పీజీ స్టూడెంట్.. క్యాంపస్ హాస్టల్​లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తం రూ.4.24 లక్షలు పోగొట్టుకుని అప్పులపాలైనట్టు పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కార్పెంటర్ ఎర్ర శ్రీనివాస్ కొడుకు ఎర్ర నవీన్ (23) ఓయూ క్యాంపస్​లో ఎంకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. క్యాంపస్​లోని మంజీరా హాస్టల్ రూమ్ నంబర్ 14లో ఉంటున్నాడు. ఆన్​లైన్ గేమ్స్​కు బానిసైన నవీన్.. కొంత కాలంగా బిట్ కాయిన్​లో పెట్టుబడులు పెట్టాడు. మొత్తం రూ.4.24 లక్షలు నష్టపోయాడు. చదువు కోసం డబ్బులు అవసరమని చెప్తుండటంతో.. తండ్రి అప్పులు చేసి మనీ పంపించాడు.

ఆ డబ్బులన్నింటినీ బిట్ కాయిన్​లో పెట్టి నష్టపోయాడు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు ఏడాది కాలంగా నవీన్ ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు పార్ట్​టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయినా, ఆ డబ్బులు వడ్డీలకు కూడా సరిపోకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. సోమవారం అర్ధరాత్రి హాస్టల్​లోని గడ్డి మందు తాగాడు. వాంతులు చేసుకోవడంతో గమనించిన తోటి విద్యార్థులు చీఫ్ వార్డెన్​కు సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం నవీన్​ను హాస్టల్ దగ్గర్లో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చీఫ్​ వార్డెన్ డాక్టర్ శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు గాంధీ హాస్పిటల్​కు తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ చనిపోయాడు. డాక్టర్లు పోస్టుమార్టం చేసి డెడ్​బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు.