
- రాజకీయ సన్యాసం తీసుకొని హరీశ్రావు మాట నిలబెట్టుకోవాలి
ఖమ్మం టౌన్, వెలుగు: రుణమాఫీ పథకాన్ని అమలు చేసి.. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. అలాగే, ఎలక్షన్లలో సవాల్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు కూడా రాజకీయం సన్యాసం తీసుకొని మాట నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. హరీశ్ రావుకు కాషాయ వస్త్రాలను కూడా పంపుతామని ఆమె పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఖమ్మం వచ్చిన రేణుకా చౌదరికి ఆ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె ఎంపీ రఘురాంరెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజాసంక్షేమమే ప్రధాన అజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోందని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే రుణమాఫీ కింద మొదటి విడతగా రూ.6,800 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు.
ఫిరాయింపులు నేర్పిందే బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ రఘురాంరెడ్డి
పార్టీ ఫిరాయింపులు నేర్పిందే బీఆర్ఎస్ పార్టీ అని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలిపారు. పట్టా ఉన్నా, లేకున్నా ప్రతి రైతుకు రుణమాఫీ అందుతుందని, పట్టాలేని ప్రతి రైతుకు టైటిల్ అస్టాబ్లిష్ చేసి వారికి కూడా రుణమాఫీ అందించేందుకు సీఎం కసరత్తు చేస్తున్నట్టు ఎంపీ తెలిపారు. జిల్లా కేంద్రంలోని లైబ్రరీకి శాశ్వత భవనం నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఆయన చెప్పారు. సుమారు 400 మంది నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా పుస్తకాలను అందుబాటులో ఉంచుతామన్నారు.