
కరోనా వైరస్ భారత్లో అన్ని రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ తీవ్రత కొంత అధికంగానే ఉంది. ఈ క్రమంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రతిఒక్కరూ మాస్క్ ధరిస్తూ…కరోనా నిబంధనలు పాటించాలని ముంబై అధికారులు సూచిస్తున్నారు. అయితే రూల్స్ పాటించకుండా… బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించని 15లక్షల మందిపై చర్యలు తీసుకున్న అధికారులు, వారినుంచి దాదాపు రూ.30కోట్లను వసూలు చేసినట్లు చెప్పారు.
కరోనా ధాటికి వణికిపోయిన ముంబైలో వైరస్ వ్యాప్తి కట్టడికి బృహన్ ముంబై కార్పొరేషన్(BMC) అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. కరోనా నిబంధనల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఇందులోభాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కేవలం సోమవారం ఒక్కరోజే 13వేల మందికి జరిమానా విధించగా, వీరి నుంచి రూ. 26లక్షలు వసూలు చేశారు.
గతేడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15, 2021 మధ్య కాలంలో మాస్కు ధరించని 15లక్షల మందికి జరిమానా విధించి, వీరి నుంచి రూ.30కోట్ల ను వసూలు చేశామని తెలిపారు అధికారులు.