ఏటూరునాగారం, వెలుగు: మేడారం జాతరకు వచ్చి తప్పిపోయిన 25,105 మందిని పోలీసులతో కలిసి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సేవ్ చేశారు. 6 నెలల శిశువు నుంచి 85 ఏండ్ల వృద్ధుల వరకు తప్పిపోగా.. కాపాడి బంధువులు, కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. శనివారం ఏటూరునాగారం సీడీపీవో ప్రేమలత తెలిపిన మేరకు.. జాతరలోని అమ్మవార్ల గద్దెల నుంచి బయటకు వచ్చే ఎగ్జిట్ పాయింట్, -చిలకలగుట్ట దారి,- జంపన్నవాగు, సులభ్ కాంప్లెక్స్,- గ్రామ పంచాయతీ,- ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఆరు మిస్సింగ్క్యాంపులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
శుక్రవారం రాత్రి వరకు తప్పిపోయిన 25,105 మందిని కాపాడి కుటుంబసభ్యులకు క్షేమంగా అప్పగించామని చెప్పారు. 10 రోజుల నుంచి 140 మంది సిబ్బంది షిఫ్ట్ లవారీగా సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. తప్పిపోయిన వచ్చిన పిల్లలకు, పెద్దలకు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు భోజనం, స్నాక్స్ అందించామని, 58 మందికి బస్సు చార్జీలు ఇచ్చి ఇండ్లకు పంపించామని వివరించారు.
