సీఎంఆర్ పెండింగ్..జనగామ జిల్లాలో మొండి బకాయిలు రూ.10 కోట్లపైనే..

సీఎంఆర్ పెండింగ్..జనగామ జిల్లాలో మొండి బకాయిలు రూ.10 కోట్లపైనే..
  • క్రిమినల్​ కేసులు పెట్టినా కేర్​ చేయని మిల్లర్లు 
  • వసూళ్ల కోసం అధికారులకు తప్పని తిప్పలు

జనగామ, వెలుగు : కస్టమ్​మిల్లింగ్​ రైస్​బకాయిల వసూళ్లకు అధికారులు తిప్పలు పడుతున్నారు. జనగామ జిల్లాలోని నలుగురు మొండి రైస్​ మిల్లర్లు రూ.10 కోట్ల విలువ చేసే సీఎంఆర్​ ఇవ్వాల్సి ఉండగా, కనీస పట్టింపు లేదు. అధికారులు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి, క్రిమినల్​ కేసులు నమోదు చేస్తున్నా డోంట్ కేర్​ అంటున్నారు. ఆర్ఆర్​యాక్టు ప్రయోగించినా పైరవీలతో కాలం గడుపుతున్నారు. 

క్రిమినల్​ కేస్​పై కేర్ లెస్..​

జనగామ జిల్లాలో రారైస్, బాయిల్డ్​ రైస్​ మిల్లులు సుమారు 60 వరకు ఉన్నాయి. వీటికి సంబంధించిన సీఎంఆర్​ సేకరణ పై అధికార యంత్రాంగం ప్రత్యేక నజర్​ పెట్టింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తాజా సీజన్ల పై నిఘా పెంచింది. త్వరగా లక్ష్యం చేరేందుకు అవసరమైన కసరత్తులు చేస్తున్నారు. కాగా, గతంలో మొండికేసి సీఎంఆర్​ ఇవ్వని మిల్లర్ల వద్ద నుంచి బకాయిలను వసూలు చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.

పనిచేసే వారి వెంటే పడినట్లుగా అధికారులు సకాలంలో అందించే వారిపై ఒత్తిడి పెంచుతున్నారన్న అపవాదు ఉన్నది. జిల్లాలోని దేవరుప్పుల మండలం మన్​పహాడ్ సాయిరాం మోడ్రన్​ బిన్నీ రైస్​మిల్ యాజమాన్యం ఏకంగా రూ.5,55,67,546 విలువైన సీఎంఆర్ ను సర్కారుకు అందించాల్సి ఉంది. 2022- 23 యాసంగి సీజన్​కు చెందిన దీనిని ఇప్పటికీ ఇవ్వడంలేదు.

ఈ మిల్లుకు కేటాయించిన వడ్లను మిల్లర్ పక్కదారి పట్టించినట్టు గతేడాది అక్టోబర్​లో అధికారులు దాడులు చేసి తేల్చారు. సీఎంఆర్​ వడ్లు మాయంకావడంతో అప్పట్లో నోటీసులు జారీ చేశారు. ఫలితం లేకపోవడంతో క్రిమినల్​ కేసులు నమోదు చేసి, ఆర్ఆర్ యాక్టు ప్రయోగించారు. సదరు మిల్లు యాజమాన్యానికి సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేశారు. రిజిస్ట్రేషన్లు చేపట్టవద్దని సబ్​ రిజిస్ట్రార్​కు లేఖ రాశారు. అయినప్పటికీ సదరు మిల్లర్ బకాయిలు చెల్లించలేదని అధికారులు చెప్పారు. 

మరో మూడు మిల్లర్లు అదే దారి..

రఘునాథపల్లి మండలం కంచనపల్లిలోని రాజరాజేశ్వర రైస్​మిల్లు యాజమాన్యం సైతం సీఎంఆర్​ ఇవ్వకుండా సతాయిస్తోంది. గతేడాది అక్టోబర్​ నుంచి ఇదే పరిస్థితి. దీంతో తాజాగా కేసులు నమోదు చేశారు. ఈ మిల్లు యాజమాన్యం 2023-–24 వానకాలం సీజన్​కు సంబంధించి రూ.1,29,88,063ల విలువ చేసే సీఎంఆర్​ ఇవ్వాల్సి ఉండగా, మొండి కేస్తున్నారు. దీంతో రెవెన్యూ రికవరీ యాక్టు (ఆర్ఆర్​) ద్వారా బకాయి వసూళ్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా సివిల్​సప్లై అధికారులు రఘునాథపల్లి తహసీల్దార్​కు చర్యల కోసం తాజాగా లేఖ రాశారు.

ఆర్ఆర్​ యాక్టు ప్రయోగిస్తే ఈ మిల్లు యాజమాన్యానికి చెందిన ఆస్తుల క్రయవిక్రయాలు నిలిచిపోనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2019-–20 యాసంగి సీజన్​కు సంబంధించి లింగాల ఘన్​పూర్​కు చెందిన కాశీ విశ్వేశ్వర మిల్లు రూ.91,59,226, శార్వాని ఇండస్ట్రీస్​ జనగామ రూ.2,91,19,715లు విలువ చేసే సీఎంఆర్​ ఇవ్వాల్సి ఉన్నా నేటికీ బకాయిలు చెల్లించడం లేదు. మొత్తంగా జిల్లాలోని నాలుగు మిల్లులు రూ.10 కోట్ల 68లక్షల 34 వేల 550లు పెండింగ్​ఉన్నది. 

బకాయిల వసూళ్లకు చర్యలు 

జనగామ జిల్లాలో నాలుగు రైస్​మిల్లుల సీఎంఆర్​ పెండింగ్​ బకాయిలు రూ.10 కోట్ల వరకున్నాయి. 2020 ఏడాది నుంచి రెండు రైస్​ మిల్లులు, 2023 వానాకాలం నుంచి మరో రెండు రైస్​ మిల్లులు బకాయి పడ్డాయి. కలెక్టర్ రిజ్వాన్​ భాషా షేక్, అడిషనల్​ కలెక్టర్​ రోహిత్​సింగ్ ఆదేశాలతో ఆర్ఆర్​ యాక్టు ద్వారా వసూళ్లకు చర్యలు తీసుకుంటున్నం. మిల్లర్లు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటుడడంతో వసూళ్లలో జాప్యం జరుగుతోంది.- హథీరామ్, డీఎం, సివిల్​ సప్లై జనగామ