
- పాజిటివ్ వచ్చిన సింగరేణి కార్మికులను వదిలేస్తున్న యాజమాన్యం
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :ఇల్లెందు ఏరియాకు చెందిన ఓ కార్మికుడు చెస్ట్ పెయిన్తో కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్లో పది రోజుల కింద జాయిన్ అయ్యాడు. పరీక్షల అనంతరం మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు రిఫర్ చేశారు. హార్ట్ ప్రాబ్లం ఉందని పరీక్షలు నిర్వహించారు. సర్జరీ చేయాలని రెండు, మూడు రోజులు అక్కడే ఉంచుకున్నారు. చివరికి నీకు కరోనా పాజిటివ్వచ్చింది.. ఇక్కడి నుంచి వెళ్లు.. అంటూ బలవంతంగా గెంటేశారు. ఆ పేషెంట్కు ఎటు పోవాలో అర్థం కాలేదు. ఆయన ఫ్యామిలీమెంబర్స్ సింగరేణి మెడికల్ ఆఫీసర్లను సంప్రదిస్తే తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. దీంతో హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న కార్మికుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఉండలేక, ఇంటికి వెళ్లలేక రెండు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఇటీవల మణుగూరు, భూపాలపల్లి నుంచి కార్పొరేట్ హాస్పిటళ్లకు రెఫర్చేసిన మరో ఇద్దరు కార్మికులనూ అక్కడి నుంచి గెంటేస్తే గాంధీలోనే ట్రీట్మెంట్ పొందుతున్నారు. కనీసం తాము రిఫర్ చేసిన పేషెంట్లు ఏమయ్యారో, ఎక్కడ, ఎలాఉన్నారో తెలుసుకునేందుకు కూడా సింగరేణి ఆఫీసర్లు ప్రయత్నించలేదు. వారి నుంచి ఫోన్లు కూడా రాలేదని పేషెంట్ల కుటుంబసభ్యులు అంటున్నారు.
సింగరేణిలో విస్తరిస్తున్న కరోనా
సింగరేణి కాలరీస్లో కరోనా నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని యాజమాన్యం, ఆఫీసర్లు చెబుతున్నా పాజిటివ్కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, అడ్రియాల, రామగుండం ఏరియాల్లో సింగరేణి గనులు విస్తరించాయి. దాదాపు54వేల మంది రెగ్యులర్,20వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు డ్యూటీలు చేస్తున్నారు. అధికారికంగా సింగరేణి పరిధిలో ఇప్పటి వరకు 14 కేసులు నమోదైనట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈక్రమంలో దాదాపు 500 మందిని హోం క్వారంటైన్, ఐసోలేషన్లో ఉంచారు. ప్రారంభంలో భూపాలపల్లి, శ్రీరాంపూర్, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లోనే కనిపించిన కరోనా ప్రస్తుతం కొత్తగూడెం, మణుగూరు ఏరియాలకు విస్తరించింది. హెడ్డాఫీసులోనూ ఒకరికి కరోనా సింప్టమ్స్ కనిపించడంతో హోం క్వారంటైన్ చేశారు.
కార్మికుల్లో టెన్షన్..
సింగరేణి రెగ్యులర్ కార్మికుల్లో సుమారు 35వేల మంది 40 ఏళ్లు దాటిన వారేఉన్నారు. ముఖ్యంగా 50 ఏండ్లు దాటిన వారు పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందుతుండడంతో కార్మికులతో పాటు వారి కుటుంబాల్లోనూ ఆందోళన నెలకొంది. తాజాగా కేసులు పెరుగుతుండడంతో కోల్బెల్ట్ కాలనీల్లోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కాలనీల వారీగా సోడియం హైపో క్లోరైడ్ లిక్విడ్స్ప్రే చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నా యాజమాన్యం నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. కానీ మైన్స్, డిపార్ట్మెంట్ల వద్ద మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నారు. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్తో పాటు భూపాలపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలో ఐసోలేషన్ వార్డులను సిద్ధంచేశారు.
రెఫరల్ పేషెంట్లకు కష్టాలు..
కంపెనీలో పనిచేస్తూ 50 ఏండ్లు దాటిన కార్మికుల్లో ఎక్కువ మంది హార్ట్, కిడ్నీ , చెస్ట్ పెయిన్, టీబీ, లివర్, గ్యాస్ ట్రబుల్లాంటి పలు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడ్తున్నారు. వీరు ఆయా సమస్యలపై సింగరేణి ఏరియా హాస్పిటల్కు వెళ్తే అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్కు పంపిస్తారు. ఇక్కడ కూడా నయం కాకపోతే హైదరాబాద్లోని కార్పొరేట్హాస్పిటల్స్ కు రిఫర్ చేస్తుంటారు. ఇలాంటివాటిలో సర్జరీ అవసరమయ్యే సీరియస్ పేషెంట్లే ఎక్కువ ఉంటారు. ప్రతి ఏడాది కార్పొరేట్ హాస్పిటల్స్ కు వందల కేసులు వెళ్తాయి. ఇలా వెళ్లే పేషెంట్లకు అయ్యే ఖర్చులను యాజమాన్యమే భరిస్తుంది. కానీ ఇటీవల ఇలా హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్తున్న కార్మిక పేషెంట్లకు కరోనా సోకుతోంది. పాజిటివ్ అని తెలియగానే కార్పొరేట్ ఆసుపత్రుల నుంచి గెంటేసినంత పని చేస్తున్నారు. వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అందించకుండా ఇళ్లకు వెళ్లగొడ్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా సింగరేణి ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఎవరైనా గట్టిగా అడిగితే గాంధీకి వెళ్లుమంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. అంతే గానీ తాము రిఫరల్ చేసిన కేసు కదా అనే కనికరం కూడా చూపడం లేదని కార్మికులు, వారి ఫ్యామిలీ మెంబర్లు అంటున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో కరోనా ట్రీట్మెంట్కు ప్రభుత్వమే అనుమతి ఇచ్చినందున తమకు యాజమాన్యమే చికిత్స చేయించాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బీహార్ లో ఒకేరోజు 107 మంది ప్రాణాలు తీసిన పిడుగులు