ఒక్క చాన్స్ ఇస్తే.. హుజురాబాద్ను వెయ్యికోట్లతో అభివృద్ధి చేస్తా: పాడి కౌశిక్ రెడ్డి

ఒక్క చాన్స్ ఇస్తే.. హుజురాబాద్ను  వెయ్యికోట్లతో అభివృద్ధి చేస్తా: పాడి కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే ..నియోజకవర్గాన్ని వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానన్నారు  బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి.  జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల సమీపంలో బీఆర్ఎస్  పార్టీ కార్యాలయాన్ని ఇంచార్జ్ ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి ప్రారంభించారు.   ఈ సందర్బంగా మాట్లాడిన  పాడి కౌశిక్ రెడ్డి..తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాయిని చెరువును రూ.100  కోట్లతో అభివృద్ధి చేస్తానన్నారు.  

ఔటర్ రింగ్ రోడ్డు, డిగ్రీ కళాశాల మైదానంలో స్టేడియం నిర్మిస్తామని చెప్పారు కౌశిక్ రెడ్డి.  శనిగరం, ఉప్పల్, వావిలాల, చల్లూరును మండలాలుగా ప్రకటిస్తామన్నారు.  అంతేగాకుండా హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటిస్తామన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ప్రతి కార్యకర్త  బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు సైనికుడిలా పనిచేయాలన్నారు.

తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అని చెప్పారు.  తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. మిగతా రాష్ట్రాలన్నీ  తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు.