
- ఆర్థిక మోసం కేసులో అదుపులోకి తీసుకున్న అధికారులు
త్రిస్సూర్: కేరళకు చెందిన వ్యాపారవేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత సుందర్ సి. మీనన్ను పోలీసులు అరెస్టు చేశారు.ఆర్థిక మోసం కేసులో క్రైమ్ బ్రాంచ్ వింగ్ కు చెందిన అధికారులు ఆదివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో హాజరుపర్చిన తర్వాత రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. సుందర్ సి. మీనన్ 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పలు సంస్థలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
ఆయనతో సహా మరి కొందరు తమ సంస్థల పేరుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ఇండియా (ఆర్బీఐ) నిబంధనలను ఉల్లంఘిస్తూ 62 మందికి పైగా ఇన్వెస్టర్ల నుంచి రూ.7.78కోట్ల డిపాజిట్లు తీసుకున్నారు. స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి తర్వాత కూడా ఆ డబ్బులు చెల్లించకుండా మోసం చేశారు. దీంతో వివిధ సెక్షన్ల కింద ఆయనపై 18 కేసులు నమోదయ్యాయి. క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.