మల్యాల, వెలుగు: తహసీల్దార్ ఆఫీస్లో భద్రంగా ఉండాల్సిన ఒరిజినల్ పహాని బుక్లు కల్లు మండువాలో ప్రత్యక్షం కావడం జగిత్యాల జిల్లా మల్యాలలో సంచలనంగా మారింది. మల్యాల మండల కేంద్రంలోని కల్లు మండువాలో ఉన్న ఓ ఫ్రై సెంటర్లో హోటల్ యజమాని పహాణీ పుస్తకంలోని పేజీలను చించి గుడాలు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు.
తహసీల్దార్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆర్ఐ రాణి ఘటనా స్థలానికి చేరుకుని పహాని బుక్ను స్వాధీనం చేసుకున్నారు. అది 1984-–85కి చెందిన ఒరిజినల్ పహణీలు, రెవెన్యూ రికార్డులు కలిగిన బుక్. కాగా ఇద్దరు రెవెన్యూ సిబ్బంది మండువాలో కల్లు తాగి ఈ బుక్ లను అక్కడే వదిలేసినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
