- బాబర్, ఘోరీ అని పెడుతుంటరు
- మన మిసైళ్లకు సృష్టిని గుర్తుచేసేలా పేర్లు
- పృథ్వీ, ఆకాష్, అగ్ని, నాగ్, త్రిశూల్ అని పెట్టుకుంటున్నం
- 2025 నాటికి రక్షణ ఎగుమతుల్లో ఇండియా టాప్
- రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
హైదరాబాద్, వెలుగు: రక్షణ ఎగుమతుల్లో ఇండియా 2025 నాటికి బలమైన శక్తిగా ఎదగాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇందులో భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) కీలక పాత్ర పోషించాలని సూచించారు. హైదరాబాద్లో శనివారం నిర్వహించిన బీడీఎల్గోల్డెన్ జూబ్లీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ మాట్లాడుతూ.. స్వదేశీ పరిజ్ఞానంతో మిసైల్స్ తయారీని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్ ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగిందన్నారు. పాకిస్తాన్ తన మిసైల్స్కు బాబర్, ఘజనీ, ఘోరిలాంటి పేర్లను పెడుతోందని, కానీ భారత్ మాత్రం సృష్టికి కారణమైన పృథ్వీ, ఆకాష్, అగ్ని, నాగ్, త్రిశూల్ లాంటి పేర్లను పెడుతోందన్నారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ సహించదన్నారు. సాయుధ దళాల ఆధునీకరణే తమ ప్రాధాన్యతమని, అందుకోసమే ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బీడీఎల్ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రేరణతో ఏర్పాటైందని, ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. బీడీఎల్కు లక్ష ఆర్డర్స్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. అంతకుముందు, బీడీఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇజ్రాయెల్-– భారత్ సంయుక్తంగా తయారు చేసిన ఎంఆర్–శామ్మిసైల్నమూనాను బీడీఎల్అధికారులు రక్షణ మంత్రికి అందించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను రిమోట్ సెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
స్వదేశీ క్షిపణులపై దృష్టి: మిశ్రా
తక్కువ ఖర్చుతో సమర్థమైన క్షిపణి ఉత్పత్తుల కోసం స్వదేశీకరణపై దృష్టి సారించినట్లు బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ్ మిశ్రా చెప్పారు. 75 నుంచి 90 శాతం ఆయుధాలను స్వదేశీయంగా తయారు చేస్తున్నామని ఆయన తెలిపారు. రక్షణ సంబంధిత వినూత్న ఉత్పత్తుల కోసం టీ-హబ్, ఐఐఐటీ హైదరాబాద్తో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. బీడీఎల్ ప్రస్థానం50 ఏళ్ల క్రితం ప్రారంభమైందని, వచ్చే ఐదేళ్లలో మిలియన్ డాలర్స్ కంపెనీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఆర్కేఎస్ బదౌరియా, సతీష్ రెడ్డి, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.