జమ్మూ:ఇండియన్ ఏయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) బేస్పై దాడి జరిగిన 24 గంటల్లోనే జమ్మూలోని రత్నుచక్ --కల్చుక్ స్టేషన్ వద్ద మరో రెండు డ్రోన్లు ఎగిరినట్లు ఆదివారం సైన్యం గుర్తించింది. రాత్రి 11.45 గంటలకు మొదటి డ్రోన్, 2.40 గంటలకు రెండో డ్రోన్ వచ్చినట్లు సోల్జర్లు చెప్పారు. ఈ రెండు కూడా క్వాడ్కాప్టర్లేనని తెలిపారు. డ్రోన్లను గుర్తించిన వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది వాటిపై 25 రౌండ్ల కాల్పులు జరిపారని జమ్మూ బేస్డ్ ఆర్మీ పీఆర్వో లెఫ్టినెంట్ కర్నల్ దేవేందర్ ఆనంద్ సోమవారం తెలిపారు. ‘రత్నుచక్ కల్చుక్ మిలిటరీ ఏరియాలో 2 డ్రోన్లను గుర్తించాం. క్విక్ రియాక్షన్ టీమ్ వాటిపై కాల్పులు జరపగా, అవి తప్పించుకున్నాయి. భద్రతా దళాలు వెంటనే రియాక్ట్ కావడంతో పెద్ద ముప్పు తప్పింది. ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించాం. సెక్యూరిటీ దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి’అని ఆయన తెలిపారు. కాగా,2002లో కూడా ఇదే ప్రాంతంలో టెర్రరిస్టులు దాడి చేశారు. ఆర్టీసీ బస్సుపై దాడికి తెగబడడంతో 31 మంది ప్రయాణికులు చనిపోయారు.
బార్డర్ లో 2019 నుంచి 300 డ్రోన్లు
పాకిస్థాన్ బార్డర్ లో 2019 ఆగస్టు నెల నుంచి ఇప్పటివరకూ సుమారు 300 డ్రోన్లు ఎగిరాయని కేంద్ర భద్రతా సంస్థల అధికారులు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నుంచే బార్డర్ లో డ్రోన్లు ఎగరడం పెరిగిందని తెలిపారు. పాక్ బార్డర్ లో ప్రధానంగా పంజాబ్, జమ్మూ ప్రాంతాల్లో ఎక్కువగా 167 డ్రోన్ లు ఎగరడాన్ని బీఎస్ఎఫ్, ఇతర బలగాలు గుర్తించాయన్నారు. బార్డర్ లో అడవులు, ఎడారులు, ఇతర క్లిష్టమైన ప్రాంతాల్లో ఎగిరే డ్రోన్ లను గుర్తించేందుకు కొత్త టెక్నాలజీలను టెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి దూరి..టెర్రరిస్టుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఇంట్లోకి చొరబడి టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఆ ఆఫీసర్, ఆయన భార్య, కూతురు చనిపోయారు. దక్షిణ కాశ్మీర్ అవంతిపొరాలోని హరిపరిగమ్ గ్రామానికి చెందిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగం, కూతురు రఫియా(22) వాళ్ల ఇంట్లో ఉండగా ఆదివారం రాత్రి 11 గంటలకు ఇద్దరు జైషే మహ్మద్ టెర్రరిస్టులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడిన టెర్రరిస్టులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన ఫయాజ్ హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే చనిపోగా, ఆయన భార్య ఆస్పత్రిలో చనిపోయారు. కూతురు రఫియా సోమవారం ఉదయం కన్నుమూశారు. టెర్రరిస్టులకోసం తనిఖీలు చేపట్టినా, ఎవరూ దొరకలేదని అధికారులు తెలిపారు. టెర్రరిస్టుల్లో ఒకరిని విదేశీయుడిగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. టెర్రరిస్టుల దాడిని కాశ్మీర్లోని అన్ని పొలిటికల్ పార్టీలు ఖండించాయి.