
న్యూఢిల్లీ: ప్రయాణికులతో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వాతావరణం ప్రతికూలంగా ఉందని, వడగండ్లను తప్పించేందుకు పాక్ ఎయిర్ స్పేస్లోకి ఎంటరయ్యేందుకు ఇండిగో పైలట్ పర్మిషన్ కోరారని డీజీసీఏ వెల్లడించింది. పరిస్థితిని వివరించి, విమానంలోని 220 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పినా పాకిస్తాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (పీఏటీసీ) పర్మిషన్ ఇవ్వలేదని పేర్కొంది.
ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ మానవతాకోణంలో స్పందించలేదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కాగా, బుధవారం 220 మంది ప్యాసింజర్లతో ఢిల్లీ నుంచి టేకాఫ్ అయిన ఇండిగో విమానం మార్గమధ్యలో వడగండ్ల వానలో చిక్కుకుంది. దీంతో విమానం తీవ్రమైన కుదుపులకు లోనైంది. ఈ క్లిష్టపరిస్థితుల్లో సైతం పైలట్ విమానాన్ని సేఫ్గా శ్రీనగర్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు.