
ఢాకా: కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ రూట్ మార్చాయి. భారత యువకులను ఉగ్రవాదం వైపు మల్లించడానికి కొత్త వ్యూహానికి తెరలేపాయి. ఇందుకు భారత పొరుగు దేశం బంగ్లాదేశ్ను పావుగా వాడుకుంటున్నాయి. బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాలలో చదువుతున్న భారత ముస్లిం యువకులను టార్గెట్ చేసుకుని.. వారిని ఉగ్రవాదులుగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇందు కోసం బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, జైషే కార్యకర్తలు రాడికల్ సంస్థలతో సంబంధాలు ఏర్పాకుంటున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.
తోయిబా, జైషే కార్యకర్తలకు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోకి చట్టబద్ధమైన ప్రవేశం పొందేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. వర్శిటీల్లోకి ఎంట్రీ ఇస్తోన్న వారు.. అక్కడ భారత విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేస్తోన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. పహల్గామ్ దాడికి కౌంటర్గా పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఎల్ఇటి, జెఎంలతో సంబంధం ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడానికి భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఈ యాక్టివిటీస్ మొదలైనట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
ఈ గ్రూపులు విశ్వవిద్యాలయ ప్రాంగణాలకు సమీపంలో మదర్సాలను నిర్వహిస్తు.. హాస్టళ్లు, ఇస్లామిక్ స్టడీ సర్కిల్, క్యాంపస్లోని భారత విద్యార్థులను టార్గెట్ చేసుకుని వారిని టెర్రరిజం వైపు మళ్లించేలా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి బాగాలేని విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారికి డబ్బు ఆశ చూపి వారి మెదళ్లలోకి ఉగ్రవాదాన్ని జోప్పిస్తున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. సానూభూతిపరులుగా మారిన విద్యార్థులను బంగ్లా నుంచి నేపాల్, మయన్మార్ మీదుగా పాకిస్థాన్ తరలించి అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు కనిపెట్టారు.
జిహాదీ కార్యకలాపాలను సమర్థించుకోవడానికి CAA, బాబ్రీ మసీద్ కూల్చివేత వంటి ఘటనలను చూపించి.. భారతదేశం ముస్లింలను అణచివేస్తోందని విద్యార్థులను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. తీవ్రవాద భావాలకు లోనైన భారతీయ విద్యార్థులకు ఉగ్రవాద శిక్షణ ఇచ్చి తిరుగు పంపుతున్నారు. వారిని స్లీపర్ సెల్స్ గా ఉపయోగించుకుంటూ.. అవసరమైన సమయంలో దాడులకు ప్రేరేపిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.