టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్​ ఆర్మీ హాజరు

టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్​ ఆర్మీ హాజరు
  • శవపేటికలకు పాక్ జెండాలను చుట్టి ప్రార్థనలు 
  • భారత్‌‌పై జిహాద్ కొనసాగించాలని నినాదాలు  
  • సోషల్ మీడియాలో వైరల్​గా మారిన వీడియోలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట ఇండియన్ ఆర్మీ నిర్వహించిన దాడిలో  80 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారు. అయితే, చనిపోయిన టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ, పోలీసు సిబ్బంది హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలు పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలను మరోసారి బహిర్గతం చేశాయని పలు నివేదికలు వెల్లడించాయి. లాహోర్ సమీపంలోని మురిద్కేలో భారత సైన్యం జరిపిన దాడుల్లో  ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు.

 వారి అంత్యక్రియల్లో లష్కరే తోయిబా (ఎల్‌‌ఈటీ) టెర్రరిస్ట్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ పాల్గొన్నాడు. చనిపోయివారి కోసం చేసిన ప్రార్థనలకు అతడు నాయకత్వం వహించాడు. ఈ ప్రార్థనకు పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పోలీసులు,  అధికారులు, హఫీజ్ సయీద్ స్థాపించిన నిషేధిత జమాత్-ఉద్-దవా (జేయూడీ) సభ్యులు హాజరయ్యారు. టెర్రరిస్టుల డెడ్ బాడీలను ఉంచిన శవపేటికలకు పాకిస్తాన్ జెండాలను చుట్టడం, వాటిని పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది మోయటం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. 

ఇతర ప్రాంతాల్లో జరిగిన టెర్రరిస్టుల అంత్యక్రియల్లోనూ పాకిస్తాన్ ఆర్మీ, పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అంత్యక్రియల సందర్భంగా టెర్రరిస్టులు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత్‌‌పై జిహాద్, ఉగ్ర కార్యకలాపాలను కొనసాగించాలని రెచ్చగొట్టే నినాదాలు చేసినట్లు నివేదికలు తెలిపాయి. కాగా, టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ హాజరవడం, ఉగ్రవాద సంస్థలతో వారి సంబంధాలను బలపరుస్తున్నదని భారత అధికారులు ఆరోపించారు.