
- మరో 78 మంది సైనికులకు గాయాలు
ఇస్లామాబాద్: ‘ఆపరేషన్సిందూర్’లో భాగంగా భారత్ నిర్వహించిన ప్రతీకార దాడిలో తమకు వాటిల్లిన నష్టంపై పాకిస్తాన్ స్పందించింది. ఓ స్క్వాడ్రన్లీడర్సహా 11 మంది సైనికులు చనిపోయారని, 78 మంది గాయపడ్డారని తెలిపింది. అదేవిధంగా 40 మంది పౌరులు చనిపోగా 121 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇందులో 15 మంది చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారని వివరించింది. ఈమేరకు మంగళవారం ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఐదుగురు సిబ్బంది మృతి చెందారని, వీరిలో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ ఉన్నారని తెలిపింది. అలాగే, పాకిస్తాన్ సాయుధ దళాలు ‘మర్కా- ఎ -హక్’ ఆపరేషన్ కింద ప్రతిస్పందించాయని, ‘ఆపరేషన్ బున్యానుమ్ మర్సూస్’ ద్వారా భారత్పై కచ్చితమైన, తీవ్రమైన ప్రతీకార దాడులు చేశాయని తెలిపింది.
భారత్ దాడిలో మృతిచెందిన సైనికులు, పౌరులకు సాయుధ దళాలతో పాటు దేశ ప్రజలు నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొన్నది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను సవాలు చేసే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొంటామని తెలిపింది. కాగా, భారత్తో జరిగిన సైనిక ఘర్షణల్లో వాయుసేనకు చెందిన ఓ యుద్ధ విమానం స్వల్పంగా ధ్వంసమైందని సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ తెలిపారు.