
ఇస్లామాబాద్: ఆపరేషన్సిందూర్తర్వాత భారత్ఏం చేస్తే పాకిస్తాన్అదే చేస్తున్నది. టెర్రరిజంపై తమ పోరాటాన్ని, ఉగ్రవాదంపై పాక్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు భారత ప్రభుత్వం ఏడుగురు ఎంపీల బృందాలను వివిధ దేశాలకు పంపిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాక్కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నది.
శాంతి రాయబారుల పేరుతో తమ ఎంపీల బృందాన్ని విదేశాలకు పంపించనున్నట్టు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్షరీఫ్ ఆదివారం ప్రకటించారు. మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత శనివారం ప్రధాని షెహబాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ప్రతినిధి బృందానికి బిలావల్ భుట్టో నేతృత్వం వహిస్తారని పేర్కొన్నది.
కాగా, దీనిపై బిలావల్ భుట్టో ఎక్స్ వేదికగా స్పందించారు. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ గొంతుక వినిపించే అవకాశం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనకు అప్పగించారని చెప్పారు. ఈ విషయంపై ప్రధాని తనతో సంప్రదింపులు జరిపారని వెల్లడించారు. ఈ బాధ్యతను స్వీకరించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. దేశసేవకోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు.